టీడీపీలోకి యార్లగడ్డ.. ముహుర్తం ఫిక్స్‌!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీలో అసంతృప్తి ఎక్కువవుతోంది. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో మంత్రులు వర్సెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పరిస్థితులు నెలకొనగా.. ఇప్పుడిప్పుడే వాటికి ఆ విబేధాలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు అధిష్టానం ప్రయత్నం చేస్తోంది. అయితే.. ఈ పరిస్థితుల్లోనే గన్నవరం రాజకీయం గరంగరంగా మారింది.

టీడీపీ తరఫున గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ.. వైసీపీకి మద్దతుగా నిలవడంతో నాడు మొదలైన ఈ వివాదం ఇప్పటికీ ఇద్దరి మధ్య నడుస్తూనే ఉంది. రెండ్రోజులకోసారి వైసీపీ తరఫున పోటీచేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావు వర్సెస్ వంశీ వర్గీయుల మధ్య గొడవ జరుగుతూనే ఉంది. సీఎం వైఎస్ జగన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ఇద్దర్నీ కలిపినప్పటికీ.. ఎన్నికలు దగ్గరపడటంతో టికెట్ విషయంలో మళ్లీ రచ్చ రచ్చ జరుగుతోంది.

ఈ గొడవల నేపథ్యంలోనే శుక్రవారం నాడు వైసీపీ, టీడీపీ కార్యకర్తలతో యార్లగడ్డ వెంకట్రావు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకే ఆత్మీయ భేటీ అని యార్లగడ్డ వర్గీయులు తేల్చిచెప్పేశారు. యువగళం పాదయాత్రలో టీడీపీలో చేరే అవకాశం ఉందని యార్లగడ్డ అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ముఖ్య నేతలతో యార్లగడ్డ చర్చించిన విషయం తెలిసిందే. అయితే.. ఎక్కువ శాతం మంది టీడీపీతోనే వెళ్లాలని యార్లగడ్డ ముందు ప్రస్తావన తెచ్చారు.

దీంతో ఎల్లుండి అనగా ఆదివారం నాడు జరిగే భేటీలో పార్టీ మార్పుపై యార్లగడ్డ నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ నెల 19న యువనేత లోకేశ్‌ యువగళం పాదయాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ యాత్రలో భాగంగా.. లోకేశ్ సమక్షంలో పార్టీలో చేరేందుకు యార్లగడ్డ సన్నాహాలు చేసుకుంటున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

కాగా.. ఇటీవలే యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘ నేను గన్నవరం రాజకీయాల్లోనే ఉంటా. ఇక్కడి నుంచే పోటీ చేస్తా. ఏ పార్టీ అన్నది కాలమే నిర్ణయిస్తుంది’ అని వెంకట్రావు వ్యాఖ్యానించారు. వైసీపీ సీనియర్‌ నేత దుట్టా రామచంద్రరావును హనుమాన్‌ జంక్షన్‌లో కలిసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం వైసీపీలో చర్చనీయాంశం అయ్యాయి.