ఆ వర్గాన్ని జగన్ వద్దనుకున్నారా?

Jagan
Jagan

ఏపీ సీఎం జ‌గ‌న్ త‌ప్పు చేశారా? ఇప్ప‌టి వ‌ర‌కు క్ష‌త్రియ వ‌ర్గం అనుకూలంగా ఉండేందుకు ఆయ‌న అనేక ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే.. తాజాగా ఆయ‌న త‌ప్పు చేశార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ విష‌యాన్ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా పేర్కొన్నారు. అదే.. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి కార్య‌క్ర‌మం. వాస్త‌వానికి ఈ కార్య‌క్ర‌మాన్ని అధికారికంగా నిర్వ‌హించాల్సిన ప‌రిస్థితి ఉంది. దీనికి సంబంధించి చంద్ర‌బాబు హ‌యాంలోనే 2018లో క్ష‌త్రియ వ‌ర్గం కోరిక మేర‌కు ఆయ‌న జీవో కూడా ఇచ్చారు.

ఇక‌, అప్ప‌టి నుంచి విధిగా జూలై 4న ప్ర‌తి ఏడాదీ.. మ‌న్యం వీరుడి జ‌యంతిని అధికారికంగా నిర్వ‌హిస్తున్నారు. గ‌త ఏడాది ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై.. భీమ‌వ‌రంలో అల్లూరి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఇక‌, తాజాగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల్సిన జ‌గ‌న్‌.. ఎక్క‌డా ఆ ఊసు ఎత్త‌కుండా.. ఆయ‌న చిత్తూరులో ప‌ర్య‌టించారు. పోనీ.. అక్క‌డైనా అల్లూరికి నివాళులు అర్పించి ఉంటే.. క‌థ వేరేగా ఉండేది. కానీ..అస‌లు సీఎం జ‌గ‌న్ ప‌ట్టించుకోలేదు. మ‌రి సీఎం జ‌గ‌నే ఈ కార్య‌క్ర‌మాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో వైసీపీ నాయ‌కులు కూడా అదే బాట‌లో న‌డిచారు.

దీంతో అల్లూరిని సీఎం జ‌గ‌న్ మ‌రిచిపోయారంటూ.. క్ష‌త్రియ సామాజిక వ‌ర్గంలో ఒక టాక్ న‌డుస్తోంది. ఇదే స‌మ‌యంలో క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కూడా.. వైసీపీ నాయ‌కులు ఈ కార్య‌క్ర‌మాన్ని ప‌ట్టించుకోలేదు. దీంతో ఉద్దేశ పూర్వ‌కంగానే త‌మ‌ను విస్మ‌రిస్తున్నారా? అని క్ష‌త్రియులు చ‌ర్చిస్తున్నారు. త‌మ కులానికి చెందిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజును అవ‌మానించిన వైనాన్ని ఇప్ప‌టికీ క్ష‌త్రియులు జీర్ణించుకోలేక పోతున్నార‌నేది రాజ‌కీయంగా త‌ర‌చుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది.

ఇలాంటి స‌మ‌యంలో వారిని అంతో ఇంతో శాంత ప‌రిచేందుకు వ‌చ్చిన అల్లూరి జ‌యంతి అవ‌కాశాన్ని సీఎం జ‌గ‌న్ జార విడుచుకున్నార‌ని.. కొంద‌రు వైసీపీ నాయ‌కులు కూడా భావిస్తున్నారు. ఇక‌, వ‌చ్చే ఏడాది చేద్దామ‌న్నా.. ఈ ప్ర‌భుత్వం ఉంటుందో ఉండ‌దో తెలియ‌ని ప‌రిస్థితి. ఇదిలావుంటే.. క్ష‌త్రియులు క‌నుక ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంటే.. కీల‌క‌మైన ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని క్ష‌త్రియ ఓటు బ్యాంకు వైసీపీకి దూరం కావ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.