మ్యాట‌ర్ వీక్.. ప‌బ్లిసిటీ పీక్‌: నారా లోకేష్

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ స‌టైర్లు వేశారు. “జగన్ పాలనలో మ్యాటర్ వీక్… పబ్లిసిటీ పీక్” అంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. “తాడేప‌ల్లి ప్యాలెస్‌కు అతుక్కుపోయే బ‌ల్లి” అని వ్యాఖ్యానించారు. చేసేది త‌క్కువ.. ప్ర‌చారం చేసుకునేది ఎక్కువ అంటూ.. త‌న‌దైన శైలిలో నారా లోకేష్ వ్యాఖ్యానించారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా గూడురు నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న మ‌త్స్య‌కారుల‌తో మాట్లాడారు. “ఫిష్ ఆంధ్రా అని హడావిడి చేసి ఫినిష్ ఆంధ్రా చేశాడు” అని జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు రువ్వారు.

జగన్ తెచ్చిన జీఓ 217(మ‌త్స్యాకారుల వేట‌పై ప్ర‌భావం)ను టీడీపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రద్దు చేస్తామని నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. తమిళనాడు జాలర్లు దాడులు చేస్తుంటే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవ‌య్య.. మత్స్యకారులను కుక్కలతో పోల్చి తిడితే సీఎం జ‌గ‌న్ తాడేప‌ల్లి ప్యాలెస్‌లో ఉండి.. క‌నీసం హెచ్చరించ‌లేద‌న్నారు.  టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద పూడికతీ స్తామని హామీ ఇచ్చారు. అలాగే డ్రైయింగ్ ప్లాట్ ఫామ్‌లు ఏర్పాటు చేయిస్తామ‌ని నారా లోకేష్ చెప్పారు.

తానే స్వ‌యంగా తమిళనాడు సీఎంతో చర్చలు జరిపి జాలర్ల సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తాన‌ని లోకేష్ చెప్పుకొచ్చారు.  ఇతర రాష్ట్రాల వారు  వేటకు రాకుండా నియంత్రిస్తామన్నారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఏపీ ప్రయాణం మొదలు అయ్యిందని.. అయినా ఏ వర్గానికి లోటు లేకుండా అందరికీ చంద్రబాబు న్యాయం చేశారని, కానీ, జ‌గ‌న్ అన్యాయం చేస్తున్నార‌ని స‌టైర్లు కుమ్మేశారు.  ఐదేళ్లలో రూ.800 కోట్లు మత్స్యకారుల సంక్షేమం కోసం ఖర్చు చేశామని, 50 ఏళ్లకే మత్స్యకారులకు పెన్షన్లు ఇచ్చామని తెలిపారు.

ఎన్నో ఏళ్లుగా మత్స్యకారుల జీవనోపాధిగా ఉన్న చెరువులు లాక్కొని వారికి వైసీపీ ప్ర‌భుత్వం తీరని అన్యాయం చేసింద‌న్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే స్వ‌యంగా కార్పొరేషన్  ఏర్పాటు చేసి.. దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామ‌ని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఆక్వా రీసెర్చ్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. చంద్రన్న భీమా పథకం తీసుకొచ్చామని.. జగన్ వైఎస్సార్ బీమా అని పేరు మార్చి క‌నీసం .. దాని కింద కూడా నిధులు ఇవ్వ‌డం లేదేన్నారు. “అందుకే.. జ‌గ‌న్‌కు మ్యాట‌ర్ లేదు.. అంటున్నా” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.