కోమటిరెడ్డి, ఈటల..ఏం జరుగుతోంది?

సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఈటల రాజేందర్ విషయంలో బీజేపీలో ఏమి జరుగుతోందో అర్థం కావటం లేదు. వీళ్ళిద్దరితో మూడు రోజుల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు సార్లు భేటీ అయ్యారు. దాంతో పార్టీలోని నేతలందరి చూపు ఇపుడు వీళ్ళిద్దరిపైనే నిలిచింది. ఇంతకీ విషయం ఏమిటంటే కోమటిరెడ్డి, ఈటల తొందరలోనే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరిని పార్టీలోనే ఉండేట్లుగా చర్చలు మొదలయ్యాయి. వీళ్ళిద్దరికి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తో అంత సఖ్యత లేదు.

అందుకనే ఇద్దరినీ అమిత్ షా ఢిల్లీకి పిలిపించుకున్నారు. వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రదారైన కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయాలని. స్కామ్ లో ఇరుక్కున్న వాళ్ళలో చాలామందిని అరెస్టు చేసిన ఈడీ కవితను మాత్రం ఎందుకు అరెస్టు చేయటం లేదని అడుగుతున్నారు. ఈడీ వైఖరి వల్ల బీఆర్ఎస్-బీజేపీ మధ్య లోపాయికారీగా ఒప్పందం జరిగిందని జనాలు డైరెక్టుగానే తమను నిలదీస్తున్నారంటు వీళ్ళిదరు అమిత్ షాతో చెప్పారట.

రెండుపార్టీల మధ్య కుదిరిన లోపాయికారీ ఒప్పందం వల్లే నరేంద్రమోడీ గురించి కేసీయార్ ఎక్కడా మాట్లాడటంలేదని, కవితను ఈడీ అరెస్టుచేయటం లేదని కాంగ్రెస్ నేతలు పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. దాంతో బీజేపీ నేతలు పూర్తిగా డిఫెన్సులో పడిపోయారు. ఈ ఆరోపణల నుండి బయటపడాలంటే కవితను వెంటనే ఈడీ అరెస్టు చేయాల్సిందే అని వీళ్ళు డిమాండ్లు చేస్తున్నారు. వీళ్ళకు అమిత్ షా సమాధానం చెప్పలేకపోతున్నారట.

జనాలు నమ్మని బీజేపీలో ఉండటం కన్నా బయటకు వెళ్ళిపోవటమే మేలని వీళ్ళు డిసైడ్ చేసుకున్నట్లు సమాచారం. అందుకనే అన్నీపనులను పక్కనపెట్టి అమిత్ వీళ్ళిద్దరితో మూడు రోజుల్లోల రెండుసార్లు భేటీ అయ్యింది. కవిత అరెస్టుపైన అమిత్ షా ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకనే హైదరాబాద్ కు తిరిగొచ్చిన కోమటిరెడ్డి ఏమిచేస్తారో అనే ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈటల సోమవారం సాయంత్రానికి హైదరాబాద్ కు చేరుకోవచ్చంటున్నారు. బహుశా ఢిల్లీలోనే ఉండిపోయింది కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడేందుకే అనే ప్రచారం కూడా ఉంది. చివరకు ఏమవుతుందో ఏమో.