చంద్రబాబు మాటలతో జగన్ కు కేసీఆర్ కౌంటర్?

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత అమరావతిని నిర్వీర్యం చేశారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో అమరావతితో పాటు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో కూడా భూముల ధరలకు రెక్కలు వచ్చాయని, ఎకరం భూమి ధర భారీ రేటు పలికేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన మరు నిమిషం నుంచే ఏపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిందని, అందుకే చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నారని టాక్ ఉంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య భూముల ధరల్లో వ్యత్యాసంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనచ్చని గతంలో చంద్రబాబు అన్నారని కేసీఆర్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో చంద్రబాబు ఈ మాట అన్నారని కేసీఆర్ గుర్తు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఏపీ, తెలంగాణలో పరిస్థితి తారు మారైందని కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం ఏపీలో 10 ఎకరాల కొనాలంటే తెలంగాణలో ఎకరం అమ్మితే చాలు అనే పరిస్థితి ఉందని కేసీఆర్ చెప్పారు. పటాన్ చెరులో 143 కోట్ల వ్యయంతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం భూమి పూజ చేసిన సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కొనేళ్లుగా తెలంగాణలో భూముల ధరలు భారీగా పెరిగాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా ఊపందుకుందని కేసీఆర్ అన్నారు. ఏపీలో భూముల ధరలు తగ్గాయని, తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి తారుమారైందని చంద్రబాబు అన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. సుపరిపాలన, అభివృద్ధితోనే ఏ రాష్ట్రంలో అయినా భూముల ధరలు పెరుగుతాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే సంగారెడ్డి నుండి హయత్ నగర్ వరకు మెట్రో వస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీకి 30 కోట్లు, ప్రతి డివిజన్ కు 10 కోట్లు ఇస్తామని చెప్పారు.

పటాన్ చెరు శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇండస్ట్రియల్ హబ్ గా ఎదుగుతోందని, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బాగా పనిచేస్తున్నారని కేసీఆర్ కితాబిచ్చారు. గతంలో పటాన్ చెరులో కరెంటు కోతలు ఉండేవని, 24 గంటలు కరెంటు కోసం సమ్మెలు చేసే వారని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం ఆ ప్రాంతంలో అసలు కరెంటు కోతలు లేవని, 24 గంటల విద్యుత్ అందించడం వల్ల పరిశ్రమలు మూడు షిఫ్టులలో నిరంతరం పనిచేస్తున్నాయని కేసీఆర్ అన్నారు. ఇండస్ట్రీలకు 24 గంటలపాటు నిర్విరామంగా కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. జగన్ పాలనను తాజా కామెంట్లతో పరోక్షంగా కేసీఆర్ విమర్శించినట్లయింది. చంద్రబాబు మాటలతో జగన్ కు కేసీఆర్ కౌంటర్ ఇచ్చినట్లయిందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.