ఢిల్లీకి చంద్ర‌బాబు.. కేంద్ర పెద్ద‌ల‌తో స‌మావేశం..

టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఈ రోజు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర పెద్దల్ని చంద్రబాబు కలిసే అవకాశం ఉండటంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాయంత్రం ఢిల్లీ వెళ్లి, రేపు మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు హైదరాబాద్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన ఎయిర్పోర్టుకు చేరుకుని ఢిల్లీకి వెళ్తారు. అక్కడ పార్టీ పెద్దలను కలిసి రాత్రికి అక్కడే బస చేసి రేపు మధ్యాహ్ననికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై రకరకాల ఊహాగానలు సాగుతున్నాయి. ఢిల్లీ పర్యటనతో రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమిత్ షాను చంద్రబాబు కలిసే అవకాశం ఉందంటూ పార్టీ శ్రేణుల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. అధినేత పర్యటనపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో అది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం అని పార్టీ వర్గాలు తెలిపాయి.

2019 ఎన్నికల తర్వాత ఆజాది కా అమృత్ మహోత్సవ్ సమయంలో ఒకసారి ప్రధాని మోడీని చంద్ర బాబు కలిశారు. జీ 20 సన్నాహక సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లినప్పుడు ఆయనతో మరోసారి భేటీ అయ్యారు. తరచూ టచ్లో ఉండాలంటూ ఆ సందర్భంగా చంద్రబాబుకు మోడీ సూచించిన విషయం తెలిసిందే. తాజా ఢిల్లీ పర్యటనలో అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేపు ఉదయం కూడా చంద్రబాబు ఢిల్లీలోనే ఉండనున్నారు.  

అంతకుముందు 2022 డిసెంబర్ 5వ తేదీన చంద్రబాబు రెండు రోజులు ఢిల్లీలో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం జీ20 సమాఖ్యపై నిర్వహిస్తున్న అఖిలపక్ష భేటీకి ఆయన హాజరయ్యారు. అంతకుముందు.. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ భేటీలో చర్చించారు. రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణ, ప్రస్తుత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలు, అధికారాన్ని ఉపయోగించి చేస్తున్న అరాచకాలపై పార్లమెంటు సాక్షిగా లేవనెత్తాల్సిన‌ విషయాలపై చర్చించారని సమాచారం.