విలీనం దిశగా షర్మిల అడుగులు?

తెలంగాణాలో ఉనికి చాటుకోవాలన్నా, రాజకీయంగా నిలదొక్కుకోవాలన్నా కాంగ్రెస్ లో విలీనం చేయటమే వైఎస్ షర్మిల ముందున్న ఆప్షన్ అనే ప్రచారం పెరిగిపోతోంది. వైఎస్సార్టీపీ పెట్టిన షర్మిల కొంతకాలంగా హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎంత హడావుడిచేస్తున్నా జనాలైతే పార్టీని పెద్దగా పట్టించుకోవటంలేదనే చెప్పాలి. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ మధ్యలో షర్మిల పార్టీ ఉనికి కూడా చాటుకోలేకపోతోంది. ఈ నేపధ్యంలోనే ఏమిచేయాలనేది షర్మిలకు పెద్ద సమస్యగా మారింది.

అందుకనే పరిష్కారంకోసం కర్నాటక డిప్యుటీ సీఎం, పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ తో భేటీ అవుతున్నట్లు సమాచారం. 15 రోజుల క్రితం భేటీ అయినపుడే కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసేయమని షర్మిలకు డీకే సూచించారట. మళ్ళీ తాజాగా సోమవారం జరిగిన భేటీలో కూడా ఇదే విషయాన్ని డీకే నొక్కిచెప్పారట. ఇద్దరిమధ్య 40 నిముషాలు జరిగిన భేటీలో పార్టీ నడపటంలో ఉన్న సమస్యలన్నింటినీ షర్మిలకు డీకే వివరించినట్తు తెలుస్తోంది. పార్టీని నడపటంలోప్రధానమైన ఆర్ధిక సమస్యపైనే ఎక్కువగా మాట్లాడారు.

పైకి ఎన్ని ఆదర్శాలు వినిపించినా అల్టిమేట్ గా డబ్బులేనిదే ఏమీచేయలేమన్న సత్యాన్ని షర్మిలకు డీకే వివరించినట్లు సమాచారం. వెలుపలి నుండి ఎవరు కూడా ఎంతోకాలం సాయం చేయలేరన్న విషయం గుర్తించాలని షర్మిలకు హితబోధ చేశారట. అదే కాంగ్రెస్ లో విలీనమైపోతే ఆర్ధికంగానే కాకుండా నేతల సమస్య కూడా ఒక్కసారిగా తొలగిపోతుందని నచ్చచెప్పారట.

అందుకు షర్మిల కూడా సానుకూలంగానే స్పందించారని సమాచారం. ఎందుకంటే పార్టీలో ఇపుడు షర్మిల తప్ప రెండో నేతే లేరు. రేపటి ఎన్నికల్లో పాలేరులో పోటీచేస్తే షర్మిల గెలిచేది కూడా అనుమానమే. ఎందుకంటే నేతలు లేరు, పనిచేసే వాళ్ళు లేరు, ఓటుబ్యాంకూ లేదు. అదే కాంగ్రెస్ లో విలీనమైపోతే వైఎస్ గుడ్ విల్ తో పాటు కాంగ్రెస్ ఓటుబ్యాంకు తోడైతే షర్మిల గెలిచే అవకాశాలున్నాయి. అలాగే పదిమంది గెలుపుకు కూడా షర్మిల కష్టపడినట్లుంటుంది. మొత్తంమీద డీకే సలహాను షర్మిల సీరియస్ గానే ఆలోచిస్తున్నారట. మరి ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.