ఏపీపై మోజు తగ్గిందా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పేరుతో చేస్తున్న హడావుడి తగ్గినట్లే  కనిపిస్తోంది. మహారాష్ట్రలో పార్టీ విస్తరణపై మొక్కుబడి పనులు చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను  పూర్తిగా  వదిలేశారని వార్తలు వస్తున్నాయి. ఏపీలో పార్టీ అభివృద్ధి చెందుతుందున్న నమ్మకం తగ్గిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కేసీఆర్ మహారాష్ట్రలో ఇప్పటికే మూడు సభలు నిర్వహించారు. ప్రతిరోజూ కొంత మందిని హైదరాబాద్ కు తీసుకు వచ్చి మరీ గులాబీ కండువా కప్పతున్నారు. అంతకుముందే పలువురు ఏపీ నేతల్ని చేర్చుకుని అక్కడ కూడా పార్టీని విస్తరిస్తామని ప్రక టించారు. ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా తోట చంద్రశేఖర్ ను ప్రకటించారు. వైజాగ్ లో సభను నిర్వహిస్తామని చెప్పారు. కానీ కేసిఆర్ ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. ఏపి వైపు కన్నెత్తి కూడా చూడటం.

ఏపిలో రాష్ట్ర శాఖ కార్యాలయాన్ని బీఆర్ఎస్  రాష్ట్ర శాఖాధ్యక్షుడు తోట చంద్ర శేఖర్ ప్రారంభించారు. దానికి కూడా బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ హాజరు కాలేదు.కనీసం తెలంగాణకు చెందిన నేతలెవరూ కూడా పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కు వెళ్లకపోవడం చర్చనీయాంశమైంది.

ఇటీవల తెలంగాణలోని పలు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కొత్త ఆఫీసులు ప్రారంభమయ్యాయి. వీటిలో చాలా వరకు స్వయంగా సీఎం కేసీఆరే ప్రారంభించారు. ఆ సందర్భంలో బహిరంగ సభలను ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాలపై సంచలన ప్రకటనలు చేశారు. ఇక తాజాగా మహారాష్ట్రకు వరుసగా సభల పేరిట ఫ్లైట్ లో వెళ్లి వస్తున్నారు. అలాంటిది ఓ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి అధినేత కేసీఆర్ దూరంగా ఉంటడంతో అనుమానాలకు  తావిస్తోంది.

నిజానికి  జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న గులాబీ బాస్ రాబోయే లోక్ సభ ఎన్నికల నాటికి పార్టీని వివిధ రాష్ట్రాల్లో బలోపేతం చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు చెబుతున్నారు.అందు లో భాగంగా ఏపీ, మహారాష్ట్ర, యూపీ, ఒడిశా, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో చెరికల పై ఫోకస్ పెట్టినట్లు చర్చ జరుగుతోంది. భాషరాని మహారాష్ట్రకు విమానంలో వెళ్లి చక్కర్లు కొట్టి వస్తున్న కేసిఆర్ పక్కనే తెలుగు రాష్ట్రమైన ఏపీలో పార్టీ స్టేట్ ఆఫీస్ ప్రారంభిస్తుంటే  దానికి దురంగా ఉండటం వెనుక అసలు మతలబు ఏంటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణ ఉద్యమసమయంలో ఆంధ్రల పట్ల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు గుర్తుకు వస్తున్నాయని కొందరంటున్నారు. విభజన  వివాదాలు, నీటి పంచాయతీ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడకు వెళితే ఏదోటి మాట్లాడేసి అనవసర వివాదాలను కొనితెచ్చుకున్నట్లవుతుందని  కేసీఆర్ భావిస్తున్నట్లుగా కొందరంటున్నారు. పైగా ఏదైనా మాట్లాడితే జగన్ కు కోపం రావచ్చని కూడా అనుమానిస్తున్నందునే  దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.