భారత్ లో 20 లక్షల కేసులు, ఏపీలో 2 లక్షలు

ప్రపంచ దేశాలను గడగడలాడించేస్తున్న కరోనా మహమ్మారి భారత్ లోనూ విశ్వరూపం చూపిస్తోంది. అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాల్లో కరోనా విజృంభణ కనిపించిన సమయంలో మన దేశంలో కేసుల సంఖ్య అంతగా లేకపోవడంతో కరోనా ముప్పు మనకు తక్కువేనన్న భావన కనిపించింది.

అయితే రానురాను ఆ దేశాల్లో కరోనా ఓ మోస్తరుగా శాంతించినా… ఇప్పుడు మన దేశంలో మాత్రం తనదైన శైలి ప్రతాపం చూపిస్తున్న కరోనా… మున్ముందు మరింత డేంజర్ పరిస్థితులు తప్పవన్న సిగ్నల్స్ ను పంపిస్తోంది. శుక్రవారం నాటిని దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షల మార్కును దాటగా… ఏపీలో 2 లక్షల మార్కును దాటేసింది.

భారత్ లో శుక్రవారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల విషయానికి వస్తే… మొత్తం కేసుల సంఖ్య 20,27,074 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క శుక్రవారం రోజే దేశంలో 62,538 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులు దేశంలో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే.

ఇదిలా ఉంటే… పాజిటివ్ కేసులు పెరుగుతున్న కొద్దీ కరోనా కారణంగా చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 41,585 మంది చనిపోగా… శుక్రవారం ఒక్కరోజే 886 మంది చనిపోయారు.

ఇదిలా ఉంటే… ఏపీలోనూ కరోనా తనదైన శైలి ప్రతాపం చూపిస్తోంది. గడచిన కొన్ని రోజులుగా రోజూ 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా.. శుక్రవారం నాడు కూడా ఏపీలో 10,171 కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా శుక్రవారం నాటికి ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల మార్కును దాటేసి 2,06,960 కు చేరుకుంది.

అదే సమయంలో మరణాల సంఖ్య కూడా భారీగానే పెరిగింది. శుక్రవారం రాష్ట్రంలో కరోనా కారణంగా 72 మంది చనిపోగా… రాష్ట్రంలో ఇప్పటిదాకా ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 1,842కు చేరుకుంది. మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షల మార్కును దాటేసిన రోజే… ఏపీలో 2 లక్షల మార్కు దాటడం గమనార్హం. దేశంలోని మొత్తం కేసుల్లో పదో వంతు కేసులు ఏపీలోనే ఉన్నాయన్న మాట.