ఆమెకు టికెట్ కష్టమేనా ?

రాబోయే ఎన్నికల్లో భూమా అఖిలప్రియకు తెలుగుదేశం పార్టీలో టికెట్ డౌటనే ప్రచారం పెరిగిపోతోంది. వరుస వివాదాల్లో మునిగిపోయిన అఖిలను పార్టీలో నుండి ఎలా సాగనంపాలనే విషయాన్ని చంద్రబాబునాయుడు, లోకేష్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. దూకుడుగా వెళుతు అందరితోను గొడవలు పెట్టుకుంటున్న అఖిలను పద్ధతి మార్చుకోమని చంద్రబాబు చాలాసార్లే హెచ్చరించారు. అయినా తన పద్దతిని మాజీమంత్రి ఏమాత్రం మార్చుకోలేదు. పద్దతి మార్చుకోకపోగా మరింత వివాదాస్పదమవుతున్నారు.

సరిగ్గా ఈ సమయంలోనే సొంతపార్టీ నేతపైనే అఖిల మద్దతుదారులు దాడిచేయటం పార్టీలో సంచలనంగా మారింది. పార్టీలో కీలకనేతయిన ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల మద్దతుదారులు దాడిచేసి తీవ్రంగా కొట్టారు. అఖిల ఉసిగొల్పటం వల్లే ఆమె మద్దతుదారులు తనపైన దాడిచేసినట్లు ఏవీ మండిపడ్డారు. అందుకనే తనపై హత్యాయత్నానికి పాల్పడినట్లు అఖిలపై ఫిర్యాదుచేశారు. తర్వాత అఖిల కూడా ఏవీపైన ఫిర్యాదుచేయటం, కేసు నమోదవ్వటం వెంటవెంటనే జరిగిపోయింది.

తాను కాకుండా పార్టీని కూడా రోడ్డున పడేసిన అఖిలపై చంద్రబాబు బాగా కోపంగా ఉన్నారట. అందుకనే జరిగిన గొడవపై త్రిసభ్య సంఘాన్ని వేశారు. శ్రీనివాసరెడ్డి, కాల్వ శ్రీనివాస్, అమర్నాధరెడ్డి నంద్యాలకు వెళ్ళి అందరితోను మాట్లాడారట. జరిగిన గొడవలో పూర్తిగా అఖిలదే తప్పని కొందరు సీనియర్ నేతలు స్పష్టంగా చెప్పారట. దాంతో అదే విషయాన్ని కమిటి చంద్రబాబుకు రిపోర్టు ఇచ్చినట్లు సమాచారం. రిపోర్టు ఆధారంగా అఖిలకు వచ్చేఎన్నికల్లో టికెట్ దక్కేది అనుమానమే అంటున్నారు తమ్ముళ్ళు.

కిడ్నాపులు, హత్యకు కుట్ర, ఫోర్జరీ, దాడుల కేసుల్లో ఇరుక్కున్న అఖిలను పార్టీలో నుండి పంపే విషయమై సీరియస్ గానే ఆలోచిస్తున్న చంద్రబాబుకు మంచి అవకాశం దొరికినట్లు టాక్ వినిపిస్తోంది. ఇపుడు గనుక అఖిలపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటే మిగిలిన నేతలకు కూడా ఒక హెచ్చరికలాగ ఉంటుందని కూడా అనుకుంటున్నారు. ఇదే సమయంలో ఏవీ వియ్యంకుడు బోండా ఉమ అయితే అఖిలపైన గట్టిగా యాక్షన్ తీసుకోవాల్సిందే అని పట్టుబడుతున్నట్లు తమ్ముళ్ళు చెబుతున్నారు. ఒకవైపు అఖిలపై యాక్షన్ తీసుకోవాలని ఒత్తిళ్ళు, మరోవైపు వివాదాస్పదమవుతున్న ఆమె దూకుడు, ఇంకోవైపు త్రిసభ్య కమిటి రిపోర్టు. మొత్తంమీద అఖిలకు టికెట్ కష్టమే అని పార్టీలో టాక్ నడుస్తోంది. మరి చంద్రబాబు ఏమిచేస్తారో చూడాల్సిందే.