జగన్ తప్ప ఆయన్ను ఎవరూ సపోర్ట్ చేయడం లేదు

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడితో చిరకాల వైరం కొనసాగిస్తున్న దువ్వాడ శ్రీనివాస్‌పై జగన్ విపరీతమైన నమ్మకం పెట్టుకున్నారు. కానీ, నియోజకవర్గంలోని మిగతా వైసీపీ నేతలే దువ్వాడకు ఏమాత్రం సపోర్ట్ చేయడం లేదు. దీంతో కొండ లాంటి అచ్చెన్నను దువ్వాడ ఢీకొట్టగలరా? ఆయన్ను ఓడించడం దువ్వాడకు సాధ్యమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

గత ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్ సభ సీటు నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడిపై పోటీ చేసి ఓటమి పాలైన దువ్వాడ శ్రీనివాస్‌ను ఈసారి అచ్చెన్నపై పోటీకి రంగంలోకి దించుతున్నారు జగన్. గత ఎన్నికల్లో ఓటమి తరువాత దువ్వాడకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు జగన్. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న దువ్వాడను ఇటీవల అచ్చెన్నపై పోటీకి టికెట్ కన్ఫర్మ్ చేశారు. జగన్ ఇటీవల శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు బహిరంగ సభలోనే ఈ మేరకు ప్రకటించారు. అయితే… టెక్కలిలో అచ్చెన్నపై పోటీ చేస్తున్న దువ్వాడకు ఆ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన పేడాడ తిలక్, మాజీ కేంద్ర మంత్రి కృపారాణి నుంచి ఇంటిపోరు ఎదురవుతోంది.

అచ్చెన్నాయుడిని ఈసారి ఎలాగైనా ఓడించి తీరాలన్న పట్టుదలతో ఉంది అధికార పార్టీ. కానీ…స్థానికంగా ఉన్న గ్రూపులు వైసీపీని ఇరుకున పెడుతున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి , కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్ పేరాడ తిలక్ … ముగ్గురు మూడు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పోటాపోటీగా గ్రూపులు మెయిన్‌టేన్‌ చేస్తూ..ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నారు. సాక్షాత్తు జగనే దువ్వాడ పేరు ప్రకటించినా తిలక్, కృపారాణిల సపోర్టు మాత్రం కనిపించడం లేదు.

గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన పేరాడ తిలక్‌కు కాళింగ కార్పొరేషన్ ఛైర్మన్‌ పదవి ఇచ్చినా ఆయకు సంతృప్తిగా లేరు. అచ్చెన్నపై మళ్లీ పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్నారు. ఇక కిల్లి కృపారాణి పార్టీలో చేరిననాటి నుంచి పదవి మాత్రం అందని ద్రాక్షలా ఊరిస్తోందట. బయటపడకపోయినా కృపారాణి వర్గం లోలోన రగిలిపోతోందట. తమ నాయకురాలిని వైసిపి కరివేపాకులా చూస్తోందని ఆవేదనగా ఉన్నారట ఆమె అనుచరులు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా ఇంకా పదవీకాలం ఉండగానే…దువ్వాడ అభ్యర్థిత్వాన్ని ఇంత ముందుగా జగన్‌ ప్రకటించడం తిలక్, కృపారాణిలకు నచ్చలేదు.

మరోవైపు దువ్వాడ కూడా తిలక్, కృపారాణిలను కలుపుకొనిపోయేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. తనకు జగన్ అండ ఉంది కదా.. ఇంకేం కావాలి అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారని టాక్. అయితే.. ఎన్నికల రాజకీయాలలో ఆరితేరిపోయిన అచ్చెన్నను ఢీకొట్టాలంటే జగన్ అండ ఒక్కటే చాలదని.. గత ఎన్నికలలో జగన్ హవా బీభత్సంగా ఉన్నప్పుడే టెక్కలిలో వైసీపీ గెలవలేకపోయిందని.. ఇప్పుడు వైసీపీపై ప్రజావ్యతిరేకత ఉన్న తరుణంలో అచ్చెన్నను ఢీకొట్టాలంటే స్థానికంగా మిగతా నేతల మద్దతూ అవసరమని.. దువ్వాడ తీరు మార్చుకోకపోతే దెబ్బతినడం ఖాయమని తెలుస్తోంది.