మంగళగిరిలో పోటీ చేసేదెవరు? అన్నా? తమ్ముడా?

మంగళగిరి వైసీపీలో రాజకీయం మారుతోంది. సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈసారి అక్కడ పోటీ చేయబోవడం లేదన్న ప్రచారానికి బలం చేకూర్చేలా ఆయన సోదరుడు, ఎంపీ అయోధ్యరామిరెడ్డి మంగళగిరి నియోజకవర్గంలో తెగ తిరుగుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ మంగళగిరిలో మకాం వేస్తున్నారు. అదేసమయంలో బీసీలకు ఇక్కడి టికెట్ ఇవ్వాలన్న వాదన ఒకటి వైసీపీలో మొదలైంది.

మంగళగిరి నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి పోటీ చేయటం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఇదే లక్ష్యంగా ఆయన గత ఇదేళ్లుగా ప్రణాళికా బద్దంగా ముందుకెళ్తున్నారు. వినూత్న సేవా కార్యక్రమాల ద్వారా ఓడిన చోటనే విజయం సాధించాలని ఆయన చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. వైసీపీ మాత్రం ఈసారి ఆళ్ల రామకృష్ణారెడ్డికి కాకుండా ఆయన సోదరుడు అయోధ్య రామిరెడ్డిని ఇక్కడి నుంచి లోకేశ్ పై పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్తున్నారు. కానీ, అయోధ్య రామిరెడ్డి మాత్రం రామకృష్ణారెడ్డే పోటీ చేస్తారని చెప్తున్నారు.

మరోవైపు ఇక్కడి నుంచి బీసీలకు టికెట్ ఇస్తారని వైసీపీలోని బీసీ నేతలు ఆశ పెట్టుకున్నారు. ముఖ్యంగా పద్మశాలీలకు మంగళగిరి టికెట్ ఇవ్వాలన్న ప్రతిపాదన ఒకటి అక్కడి నాయకులు అధిష్ఠానం ముందుంచుతున్నారు. దీనికి బలమైన కారణం ఉంది. రాష్ట్రంలో పద్మశాలీ జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో మంగళగిరి ఒకటి. ఇక్కడ మొత్తం 2,70,000 మంది ఓటర్లు ఉండగా అందులో బీసీలే ఎక్కువ. అందులోనూ పద్మశాలీ కులస్థులు ఎక్కువ. వీరు ఎటువైపు మొగ్గుచూపితే ఆ పార్టీకి విజయం వరిస్తుందనే బలమైన టాక్ ఉంది.

ఓవైపు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మంగళగిరి పై ప్రత్యేక దృష్టి సారించి తరచూ పర్యటిస్తున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా అవకాశం చిక్కినప్పుడల్లా సేవా కార్యక్రమాల పేరుతో జనంలో తిరుగుతున్నారు. దీంతో వైసీపీ టికెట్ ఎవరికిఇస్తారన్నది చర్చనీయంగా మారింది.

మరోవైపు మంగళగిరి వైసీపీలో నాయకులు ఒక్కొక్కరుగా రాజీనామా చేయటం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఈపూరి రమేష్ పార్టీని వీడి టిడిపిలో చేరారు. తాజాగా శివాలయం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ మునగపాటి వెంకటేశ్వరరావు పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

రానున్న రోజుల్లో కొందరు ద్వితీయ శ్రేణి నేతలతో పాటు ఓ కీలక నేత పార్టీని వీడనున్నట్లు సమాచారం.ఇందుకు స్థానిక నాయకత్వం పై ఉన్న అసంతృప్తి కారణమని చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీ ఏ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించినప్పటికీ టిడిపి తరఫున మాత్రం లోకేష్ బరిలోకి దిగటం ఖాయమని చెబుతున్నారు. అయితే… వైసీపీ కనుక పద్మశాలీలను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తే టీడీపీ కూడా ప్లాన్ మార్చే అవకాశం ఉందన్న వాదన ఒకటి వినిపిస్తోంది