బాబు, లోకేషే అంటూ పార్టీని ముంచేస్తోందెవ‌రు ?

పార్టీలో యాక్టివ్ గా ఉండాల‌ని.. దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌ని.. వ‌చ్చేఎన్నిక‌ల్లో పొత్తులు ఉన్నా.. లేకున్నా.. పార్టీ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ విజ‌యం ద‌క్కించుకోవాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప‌దే ప‌దే పార్టీ నేత‌ల‌కు చెబుతున్నారు. ఎక్క‌డ ఎప్పుడు మీటింగ్ పెట్టినా.. చంద్ర‌బాబు చేస్తున్న దిశానిర్దేశం.. తొలి ప‌లుకు కూడా ఇదే. అయితే.. దీనిని ఎంద‌రు అందిపుచ్చుకుంటున్నారు? ఎంత మంది బాబు చూపిన దారిలో ప్ర‌యాణం చేస్తున్నారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. సుమారు 80 శాతం మంది టీడీపీ నాయ‌కులు ఇప్ప‌టికీ నిస్తేజంలో ఉన్నారు. అంటే.. వారు ప్ర‌య‌త్నించ‌డ‌మే లేదు. అస‌లు కాలు కూడా బ‌య‌ట‌కు పెట్ట‌డం లేదు. ఎన్నిక‌లు వ‌చ్చాక చూద్దాంలే అనే ధోర‌ణిలోనే ఉన్నారు. నిజానికి ఎన్నిక‌ల‌కు మ‌రో 10 మాసాలు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. అలాంట ప్పుడు.. వీరు ఎందుకు ఇంత నిస్తేజంలో ఉన్నారు? అంటే.. రెండు ప్ర‌ధాన కార‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు పరిశీల‌కులు.

1) అంతా చంద్ర‌బాబు చూసుకుంటారు. 2) పొత్తుల‌పై గంద‌ర‌గోళం. అయితే.. పొత్తుల విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. తొలి విష‌యం మాత్రం చాలా ఇబ్బందిక‌రంగా మారింది. అంతా చంద్ర‌బాబు, నారా లోకేష్ చూసుకుంటారు.. మా కెందుకు అనే ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తే.. వ్య‌క్తిగ‌తంగా వారే న‌ష్ట‌పోయే ప్ర‌మాదంతో పాటు పార్టీకి కూడా ఇబ్బందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. టికెట్ వ‌చ్చినా రాకున్నా.. ప్ర‌జ‌ల్లో ఉంటే.. ఆ హ‌వా వేరుగా ఉంటుంద‌ని చెబుతున్నారు.

కానీ, మెజారిటీ నాయ‌కులు చంద్ర‌బాబు వ‌స్తే.. క‌నిపిస్తున్నారు.ఆయ‌న అటు వెళ్ల‌గానే వీరు త‌మ వ్య‌వ‌హా రాల్లో మునిగిపోతున్నారు. ఫ‌లితంగా వీరు చంద్ర‌బాబు, నారా లోకేష్‌పై ఆధార‌ప‌డిన ప‌రాన్న జీవులా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక‌, పొత్తుల విష‌యాన్ని చూస్తే.. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వాస్త‌వానికి అప్ప‌టి ప‌రిస్థితిని బ‌ట్టి పొత్తులు లేకుండా కూడా వెళ్లే ఆలోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్నారు. మ‌రి ఇప్ప‌టికైనా నాయ‌కులు క‌దులుతారా? లేదా? చూడాలి.