ప్లేబ్యాక్ మార్చాల్సిందే… బాబు గారూ..!


టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాష్ట్ర ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. ఏదో ఒక పేరుతో ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండేలా కార్య‌క్ర‌మాలు నిర్ణ‌యించుకున్నారు. అదేస‌మ‌యంలో పార్టీ నేత‌ల‌కు కూడా ఆయ‌న హితోప‌దేశం చేస్తున్నారు. అయితే.. ఏ కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా.. చంద్ర‌బాబు వైఖ‌రి, ఆయ‌న శైలి మాత్రం మార‌డం లేదనేది ప‌రిశీల‌కుల మాట‌. నిజానికి ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌లు కోరుకునేది వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం. ఇదే పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు కూడా వ‌స్తుంది.

అయితే, చంద్ర‌బాబు స్ట‌యిల్ మాత్రం మార‌డం లేద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆయ‌న ఎక్క‌డ‌కు వెళ్లినా..ఏం చేసినా జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు మాత్ర‌మే చేస్తున్నారు. వైసీపీ నేత‌ల క‌న్నా కూడా.. సీఎం జ‌గ‌న్ విషయాన్ని మాత్ర‌మే హైలెట్ చేస్తున్నారు. దీనివ‌ల్ల‌.. గ‌తంలో చంద్ర‌బాబుకు ఉన్న పేరు ఇప్పుడు మ‌రోసారి తెర‌మీదికి వ‌స్తోంది. ఆయ‌న‌కు మైకు దొరికితే వ‌దిలి పెట్ట‌రు.. అంటూ.. గ‌తంలో ఒక టాక్ వినిపించేది.

దీనివ‌ల్ల చంద్ర‌బాబు ప్ర‌సంగాలు అప్ప‌ట్లో ప్ర‌జ‌ల దృష్టికి వెళ్ల‌లేదు. ఆయ‌న ఏం చెప్పినా.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఇక‌, ప్ర‌భుత్వం ప‌డిపోయాక‌.. చంద్ర‌బాబులో కొంత మార్పు అయితే క‌నిపించింది. కానీ, ఇటీవల కాలంలో మ‌రోసారి వైసీపీని వ్య‌తిరేకించ‌డ‌మే ప‌నిగా చంద్ర‌బాబు ప్రసంగాలు దంచి కొడుతున్నారు. ఇది.. టీడీపీ అభిమానుల‌కు, పార్టీ నాయ‌కుల‌కు విన‌సొంపుగా ఉన్న‌ప్ప‌టికీ.. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు మాత్రం బొరు కొడుతోంద‌న్న‌ది నిజం.

వైసీపీ అధినేత జ‌గ‌న్ విష‌యాన్ని తీసుకుంటే.. ఆయ‌న ఇస్తున్న సొమ్ములు తీసుకుంటున్న‌వారు.. ప‌థకాల ల‌బ్ధి దారులు చాలా మంది ఉన్నారు. ఎంత‌లేద‌న్నా.. ఉప్పుతిన్నందున ఆయ‌న ప‌ట్ల ప్రేమ‌, అభిమానం అయితే ఉంటుంది. మ‌రీ ముఖ్యంగా డ్వాక్రా మ‌హిళ‌ల‌కు వైసీపీ ప్ర‌భుత్వం చాలానే చేరువ అయింది.

ఇక‌, గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఇంటికే ఫించ‌న్లు ఇస్తున్నారు. ఇలా.. అనేక కార్య‌క్ర‌మాలు.. మంచివే ఉన్నాయ‌ని ప్ర‌జ‌లు భావిస్తున్న స‌మ‌యంలో అదే ప‌నిగా సీఎం జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డం వ‌ల్ల చంద్ర‌బాబుకు క‌లిసి వ‌చ్చేది ఏమీలేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.