కవిత, సంజయ్ ఇద్దరికీ ఫోనే కీలకం

లిక్కర్ స్కాంలో విచారణను ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవిత నాలుగు సార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ముందు లేదు.. లేదంటూనే ఆమె తన పది సెల్ ఫోన్స్ తీసుకెళ్లి ఈడీ కార్యాలయంలో అప్పగించారు. కట్ చేసి చూస్తే.. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేయడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయన విషయంలోనూ ఫోనే కీలకమని చెబుతున్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత, సిసోడియా సహా పలువురు ముందుజాగ్రత్తగా ఫోన్లు పగులగొట్టారని సీబీఐ, ఈడీ అప్పట్లో ఆరోపించాయి. చాలా రోజుల వరకు నిందితులు, అనుమానితులు సమాధానం చెప్పలేదు. వన్ ఫైన్ మాణింగ్ కవిత ఇంటి నుంచి బయటకు వచ్చి ఫోన్లను మీడియాకు చూపించారు. వాటిని ఈడీ కార్యాలయంలో సమర్పించిన రెండు రోజుల తర్వాత కవిత లీగల్ అడ్వయిజర్ అక్కడకు వెళ్లి వాటిని పరిశీలించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసి వచ్చారు. స్కాముకు సంబంధించిన కీలక సమాచారం ఫోన్లలో ఉందని ప్రకటించిన ఈడీ … వాటిని స్వాధీనం చేసుకున్న తర్వాత మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు..

ఇప్పుడు సంజయ్ కేసులో వరంగల్ సీపీ రంగనాథ్‌ కూడా ఫోన్ సంభాషణను ప్రస్తావిస్తున్నారు. ఫోన్ ఎక్కడుందో తెలీదని సంజయ్ అంటున్నారని… ఫోన్ ఇస్తే కీలక సమాచారం బయటకు వస్తుందని సీపీ చెబుతున్నారు. బండి సంజయ్ ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తే.. పరీక్షా పత్రం షేర్ అయిన సమాచారం మొత్తం బయటకు వస్తుందని చెబుతున్నారు. పిల్లల సాయంతో ప్రశ్నాపత్రం తెచ్చుకున్నారని అంటూ…. అది బీజేపీ నాయకులకు చాలా మందికి షేర్ అయ్యిందన్నారు. దీని వెనుక కుట్ర, అవినీతిని బయటకు తీయాలంటే ముందుగా సంజయ్ ఫోన్ స్వాధీనం చేసుకుని అందులోని సమాచారాన్ని రిట్రైవ్ చేయాల్సి ఉంటుందని పోలీసులు అంటున్నారు. అందుకే సంజయ్ కస్టోడియల్ ఇంటరాగేషన్‌ అవసరమని పోలీసులు అభ్యర్థించడంతో కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి..