రాహుల్ ఎఫెక్ట్:  మూడు పార్టీల‌పైనా కేవీపీ ఫైర్‌..

KVP

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీని పార్ల‌మెంటు నుంచి స‌స్పెండ్ చేయ‌డం.. ఆయ‌న‌పై కేసు.. కోర్టు తీర్పుల నేప‌థ్యంలో ప‌లు పార్టీలు రాహుల్‌కు అండ‌గా నిలిచాయి. కొన్ని రాష్ట్రాల్లో అధికార‌, ప్ర‌తిప‌క్షాలు కూడా రాహుల్‌కు అనుకూలంగా మారాయి. అయితే.. ఏపీ నుంచి మాత్రం ఎవ‌రూ ఈ ఘ‌ట‌న‌పై రియాక్ట్ కాలేదు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. కాంగ్రెస్ కీల‌క నేత‌, వైఎస్ ఆత్మ‌గా పేర్కొనే కేవీపీ రామ‌చంద్ర‌రావు.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “మీకు ఏమైంది?  ఇప్పుడు నోరు విప్ప‌క‌పోతే..రేపు మీకు అన్యాయం జ‌రిగితే.. ఎవ‌రూ ముందుకు రారు“ అని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

టీడీపీపై..
1984లో నాదెండ్ల భాస్కరరావు సమయంలో చంద్రబాబు చేసిన పోరాటం ఎవరూ మరచిపోరని కేవీపీ అన్నారు. 2002లో గుజరాత్ మారణహోమం తరువాత మోడీ నరహంతకుడు అని వ్యాఖ్యానించి ధీరశాలిగా గుర్తింపు పొందార‌ని వ్యాఖ్యానించారు. కానీ, రాహుల్ విషయంలో స్పందించడంలేదన్నారు. ఒకవిధంగా తాము, చంద్రబాబు మిత్ర పక్షాలమన్నారు. 2018లో ఢిల్లీలో చంద్రబాబు దీక్ష చేస్తే.. రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ వెళ్లి మద్దతు పలికారని గుర్తుచేశారు. చంద్రబాబు ఓటమి తరువాత ఆయన్ను కించపరచవద్దని రాహుల్ గాంధీ తమకు సూచించారని చెప్పారు.

వైసీపీపై..
వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం జగన్‌పై కేవీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏం జ‌రిగినా.. మోడీ ప్ర‌జాస్వామ్యాన్ని దునుమాడినా.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌ మాట్లాడరు.. నొరు‌విప్పరని కేవీపీ విమర్శించారు. రేపు మీ హక్కుల గురించి అడిగే అర్హత కోల్పోతారని మండిపడ్డారు. ఇష్టం ఉన్నా లేకున్నా.. ఇటువంటి సందర్భాల్లో అయినా ముందుకు రావాలి కదా? అని కేవీపీ ప్రశ్నించారు.

జ‌న‌సేన‌పై..
జనసేనకు ప్రజల్లో‌ విశ్వాసం ఉంది.. ప్రశ్నించడానికే పుట్టానని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ చెబుతాడని, పొత్తులో ఉండి బయటకి స్పందించక పోయినా… కనీసం వారిని కలిసి కూడా ప్రశ్నించలేడా? అని కేవీపీ ప్రశ్నించారు. ఇలా అయితే రేపు ప్రజలకు ఆయన సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు. నేడు రాహుల్ గాంధీ‌కి అన్యాయం చేస్తే ఏపీ నుంచి అడిగే వారే లేకుండా పోయారా? అని కేవీపీ ప్రశ్నించారు. దేశం మొత్తం ఏకం అవుతున్న‌ వేళ ఏపీ నుంచి ఒక్క ప్రజాప్రతినిధి లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.