అలా అయితే.. మీరెన్నికోట్లు ఇచ్చారు..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్ చేసిన న‌లుగురు ఎమ్మెల్యేల‌కు టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబునాయుడు 10 నుంచి 20 కోట్ల రూపాయ‌లు ముట్ట‌జెప్పార‌ని.. లేక‌పోతే..వారెందుకు ఓట్లువేస్తార‌ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, వైసీపీ కీల‌క నాయ‌కుడు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. అయితే..దీనిపై నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే, రెబ‌ల్ నాయ‌కుడు కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. అలా అయితే.. టీడీపీ నుంచి న‌లుగురు, జ‌న‌సేన నుంచి ఒక ఎమ్మెల్యే వైసీపీ అభ్య‌ర్థుల‌కు ఓటేశారు క‌దా.. మ‌రి వారికి ఎన్నికోట్లు క‌ట్ట‌బెట్టారో చెప్పండి! అని నిప్పులు చెరిగారు.

నేను ఆత్మప్రభోదానుసారమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేశాను. నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. వైసీపీ అభ్యర్థులకు ఓటేయమని అధిష్ఠానం కానీ పార్టీ పెద్దలు కానీ నాకు చెప్పలేదు. తెలుగుదేశం వాళ్లు కూడా నన్ను అడగలేదు అని కోటంరెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన‌ట్టు.. శ్రీధర్ రెడ్డి మా పార్టీ ఎమ్మెల్యేనే కాదు అని. ఏమయ్యా సజ్జలు.. నీది నోరా.. నాలుకా లేకుంటే తాటి మట్టా. ఆ రోజు మా పార్టీ ఎమ్మెల్యేనే కాదని.. ఇప్పుడు సస్పెన్షన్, క్రాస్ ఓటింగ్ అని ఎలా మాట్లాడతావ్..?. అని కోటంరెడ్డి నిల‌దీశారు.

అసలు తాను అమ్ముడుపోయానని మీరెలా మాట్లాడుతార‌ని కోటంరెడ్డి ప్ర‌శ్నించారు తాను అమ్ముడుపోయి ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు(వైసీపీ) ఎంతపెట్టి కొన్నారో కూడా చెబితే బాగుంటుందన్నారు.(గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్నారు). అదేవిధంగా టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, జనసేనకు చెందిన ఒక ఎమ్మెల్యే.. వైసీపీకి ఓటేశారని సజ్జల చెప్పారని.. అయితే ఆ ఐదుమంది ఎమ్మెల్యేలకు మీరు (సజ్జల) ఎన్ని కోట్లు ఇచ్చారో తేల్చి చెప్పాల‌ని కోటం రెడ్డి స‌వాల్ విసిరారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు అంగీకరించరని కోటంరెడ్డి హెచ్చరించారు.

గేట్లు తెరిస్తే వ‌చ్చేస్తారు!

వైసీపీ నుంచి ఎంతమంది బయటికొస్తారనే విషయం తాను చెప్పలేనని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే, మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర‌ అసంతృప్తిగా ఉన్నారన్న మాట వాస్తవమ‌న్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితోనే రగిలిపోతున్నారు. ఆ అసంతృప్తిని కొందరు బాహాటంగా వెళ్ల‌గ‌క్కుతుండగా.. మరికొందరు లోలోపల ఉడికిపోతున్నారు. వైసీపీలో ఇమడలేక వేరే పార్టీలో చేరేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు ఆలోచనలు చేస్తున్నారు. ఏ పార్టీ అయినా గేట్లు తెరిస్తే.. వ‌ర‌ద‌లా ఎమ్మెల్యేలు వ‌చ్చేస్తారు అని కోటంరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.