ఈడీ విచారణకు కవిత గైర్హాజరు.. రావాల్సిందేనన్న ఈడీ

kavitha


దిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తో తలపడుతున్నారు. ఈ రోజు(మార్చ్ 16) ఆమె ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా తన తరఫున తన ప్రతినిధిగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ను పంపించారు. అనారోగ్య కారణాల వల్ల రాలేకపోతున్నానని.. మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానం ఇదే అంటూ తన ప్రతినిధితో ఈడీ అధికారులకు లేఖ పంపారు. సుప్రీంకోర్టులో పిటీషన్ పెండింగ్ లో ఉందని.. కోర్టు నిర్ణయం తర్వాత హాజరవుతానని లేఖలో స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే… కవిత లేఖపై స్పందించిన ఈడీ విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఉత్కంఠ ఏర్పడింది.

దిల్లీలోనే ఉన్న కవిత బుధవారం సాయంత్రం వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకే ఈడీ అధికారుల ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే… గురువారం ఉదయం నుంచే ఆమె తన న్యాయవాదులతో సుదీర్ఘంగా చర్చించారు.అనంతరం ఈడీ ప్రశ్నలకు సమాధానాలను లేఖ ద్వారా పంపించాలని నిర్ణయించారు.

కాగా… కవితకు మద్దతుగా బీఆర్ఎస్ మంత్రులు అయిదుగురు దిల్లీలోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు లాయర్లతో వారు చర్చలు జరుపుతున్నారు. కవిత పంపిన లేఖపై ఈడీ అధికారుల స్పందనేంటనేది చూడాలి. కాగా దిల్లీలోని కవిత నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి 10 నిమిషాలలో చేరుకోవచ్చు.. కానీ, ఆమె తన తరఫున ప్రతినిధిని పంపించడంతో.. ఈడీతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.