అన్ని పార్టీల‌నూ క‌లిపి దంచేసిన ప‌వ‌న్‌

ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప‌న్నెత్తు మాట అన‌ని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తాజాగా కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో బీసీ సామాజిక వ‌ర్గంపై ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌పైనా.. బీఆర్ఎస్ పార్టీపైనా.. అదే స‌మ‌యంలో వైసీపీ, టీడీపీల‌పైనా.. ప‌వ‌న్‌ విరుచుకుప‌డ్డారు. అంటే.. మొత్తంగా అటు తెలంగాణ‌, ఇటు ఏపీల‌కు సంబంధించి అన్ని పార్టీల‌నూ క‌లిపి ఆయ‌న దంచేశారు.

తెలంగాణలో 26 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించడంపై కేసీఆర్ ఎందుకు స్పందించ‌డం లేద‌ని.. ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. ఈ దారుణ అన్యాయంపై బీఆర్ఎస్ అధినేత‌గా, ముఖ్య‌మంత్రిగా కేసీఆర్‌ వివరణ ఇవ్వాలని ప‌వ‌న్ నిల‌దీశారు. బీసీ కులాల తొలగింపుపై వైసీపీ, టీడీపీ కూడా స్పందించాలన్నారు. బీసీలకు జనసేన అండగా ఉంటుందని తెలిపారు. చట్టసభల్లో సంఖ్యా బలం లేని బీసీలకు ఏం చేయగలం అనే దానిపై ఆలోచిస్తాన‌న్నారు.

“మీ ఓట్లే మీకు పడవు అని బీసీలను హేళన చేస్తున్నారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు అందరూ ఏకతాటిపైకి రావాలి. నన్ను ఒక కులానికి పరిమితం చేసి బీసీ నాయకులతో తిట్టిస్తున్నారు. నన్ను బీసీలతో తిట్టిస్తే రెండు వర్గాల వారు గ్రామస్థాయిలో ఘర్షణకు దిగుతారు. నేను ఒక కులానికి మాత్రమే నాయకుడిని కాదు. ప్రజలందరికీ నాయకుడిగా ఉండాలనుకుంటు న్నా” అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

బీసీల‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్యాయం జ‌రుగుతోంద‌ని ప‌వ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బీసీలు రాజ్యాధికారం అర్థించటం కాదు.. సాధించుకోవాలని పవన్‌ కల్యాణ్ సూచించారు. అన్ని బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదని చెప్పారు. ఇన్నేళ్లుగా బీసీల సమైక్యత ఎందుకు సాధ్యం కాలేదో అర్థం కావట్లేదన్నారు. గతంలో 93 ఉన్న బీసీ కులాలు ఇప్పుడు 140కి ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. దీనిపై బీఆర్ఎస్‌, వైసీపీలు స‌మాధానం చెప్పాల్సిందేన‌ని అన్నారు.