రాధాకు హామీ లభించిందా ?

వంగవీటి రాధాకృష్ణకు హామీ లభించిందా ? పార్టీవర్గాల్లో ఇపుడీ విషయమీదే చర్చ జరుగుతోంది. ఈనెల 14వ తేదీన జనసేనలో చేరటానికి రాధా ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అలాంటిది హఠాత్తుగా మంగళవారం ఉదయం పాదయాత్రలో ఉన్న నారాలోకేష్ ను రాధా కలిశారు. ముందు పాదయాత్రలో పాల్గొన్న రాధా తర్వాత భోజన విరామ సమయంలో లోకేష్ తో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు.

పార్టీవర్గాల నుండి అందిన సమాచారం ఏమిటంటే టీడీపీ అధికారంలోకి రాగానే రాధాకు ఎంఎల్సీ పదవి ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారట. అందరం కలిసి కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని లోకేష్ స్పష్టంగా చెప్పారట. అనవసరంగా పక్క పార్టీలోకి వెళ్ళే ఆలోచన చేయద్దని హితవు చెప్పినట్లు తమ్ముళ్ళు చెబుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చేముందు ఇంకోపార్టీలోకి వెళ్ళే ఆలోచన మంచిదికాదన్నారట. నిజానికి రాధాకు ఉన్న బలమైన కోరిక ఏమిటంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీచేయాలని.

అయితే అందుకు అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ బలమైన నేత. బోండాను కాదని చంద్రబాబునాయుడు కొత్తగా రాధాకు టికెట్ ఇచ్చే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. అందుకనే అవకాశం లేని టికెట్ విషయంలో రాధాలో ఆశలు పెంచేకంటే ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేయటమే మేలని లోకేష్ భావించారట. అందుకనే ఎంఎల్సీ పదవిని ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు.

అలాకాదంటే వేరే నియోజకవర్గంలో పోటీచేసే ఆలోచనుంటే చెప్పమని అడిగారట. అయితే రాధా దానికి పెద్దగా సానుకూలంగా స్పందించలేదని సమాచారం. తాను చెప్పాల్సింది చెప్పానని కాబట్టి మిగిలిన విషయాలో ఆలోచించుకుని నిర్ణయం తీసుకోమని చెప్పేశారు. మరిపుడు రాధా ఏమి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. నిజానికి రాధా వల్ల పెద్దగా పార్టీకి వచ్చే ఉపయోగం ఏమీలేదు. కాకపోతే వంగవీటి రంగా కొడుకుగా రాధాకు కాస్త పేరుంది. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని చంద్రబాబు ఆలోచన. కాపుల ఓట్లు టీడీపీకి పడేట్లుగా రాధా చేయగలరని చంద్రబాబు నమ్ముతున్నారు. మరి చంద్రబాబు నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో చూడాల్సిందే.