తెలంగాణ‌పై టీడీపీ అధిరిపోయే ప్లాన్‌!

తెలంగాణ‌లో టీడీపీ పుంజుకునేలా ఆ పార్టీపెద్ద‌లు అధిరిపోయే ప్లాన్ వేశారు. పార్టీని ఇంటింటికీ తీసుకువెళ్లి.. ప‌రిచ‌యం చేసేందుకు.. పార్టీని పుంజుకునేలా చేసేందుకు.. ఈ ఏడాది జ‌రిగే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పూర్వవైభవం దిశగా అడుగులు పడుతుంద‌ని నాయ‌కులు చెబుతున్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, విద్యావంతులను పార్టీవైపు తిప్పేలా ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో ఆదివారం నుంచి ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం మొదలు పెడుతున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్రంలో పది రోజులపాటు మండలం యూనిట్‌గా ప్రతి బూత్ స్థాయిలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వ‌హించ‌నున్నారు. అన్ని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో డివిజన్ల వారీగా కొనసాగుతుంది. అదే ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకుంటూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపడతారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని డివిజన్లలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు వివరిస్తారు. కిలో రూ.2 బియ్యం పథకం, పట్వారీ, పటేల్ వ్యవస్థ రద్దు, మహిళలకు ఆస్తి హక్కు, బీసీ వర్గాలకు పెద్దపీట వంటి అంశాలు వివరించడంతోపాటు టీడీపీ పూర్వ వైభవం కోసం సలహాలు, సూచనలు స్వీకరిస్తారు.

పది రోజుల తర్వాత మరో 20 రోజులపాటు ప్రతి మండలంలో అన్ని గ్రామాల్లో బస్సు యాత్రలు చేపట్ట‌నున్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని మార్చి 27వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ‘సింహగర్జన’ పేరిట లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించ‌నున్నారు. ఆ సభకు ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరవుతారు. ఏదేమైనా.. గ‌తానికి భిన్నంగా టీడీపీ పుంజుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.