సీబీఐ విచారణకు రోజా సవాల్

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, యువగళం పాదయాత్ర అప్రతిహతంగా సాగుతోంది. జనం భారీగా తరలి వస్తున్నారు. సైకో పోవాలి, సైకిల్ రావాలని అంటూ నినదిస్తున్నారు. జగన్ పాలనపై లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. జగన్ దిగిపోయే టైమ్ వచ్చిందని అంటున్నారు. ఇక పర్యాటక మంత్రి రోజాను లోకేష్ ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. జగన్ ను ఏరా అనే స్థాయిలో సంబోధిస్తున్న లోకేష్… మంత్రి రోజాను జబర్దస్త్ ఆంటీ అని సంబోధిస్తున్నారు. గ్రావెల్, గ్రానైట్ లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు..

లోకేష్ చేసిన అవినీతి ఆరోపణలపై రోజా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. తన ఆస్తులు, లోకేష్ ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాలు చేశారు. అవినీతి చేయాల్సిన అవసరం తనకు లేదని, చంద్రబాబు కుటుంబం ఎంత తిన్నదో తేల్చేందుకు తాము వెనుకాడబోమని రోజా అంటున్నారు. డబ్బు సూటు కేసుల కోసం తన్నుకున్నారని, బ్రాహ్మణి అలిగి చాలా రోజులు పుట్టింటికి వెళ్లిపోయిందని రోజా చెబుతున్నారు. సిబీఐ సహా ఏ విచారణకైనా సిద్ధమేనని ఆమె అంటున్నారు..

జగన్ ను ఏరా అని పిలుస్తున్న లోకేష్ ను రోజా ఇప్పుడో బఫున్ అని సంబోధిస్తున్నారు. ఆమె కూడా ఏరా, వాడు-వీడు అని తిట్టేస్తున్నారు. లోకేష్ భార్య బ్రాహ్మణికి, తల్లి భువనేశ్వరీకి పడటం లేదని ఆమె కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. తనను జబర్దస్త్ ఆంటీ అంటే ఆయన తల్లి,భార్యలను హెరిటేజ్ ఆంటీ, హెరిటేజ్ పాప అని పిలవాలా అని ఎదురు దాడి చేశారు..

లోకేష్ పాదయాత్రలో జనం ఉండటం లేదని ఆమె కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. తమ దగ్గర పూర్తి ఆధారాలున్నాయన్నారు. స్థానికంగా జనం రాకపోతుంటే బయట నుంచి డబ్బులిచ్చి బతిమాలి తీసుకొచ్చుకుంటున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. స్క్రిప్తు చూసి చదివే లోకేష్… తనకు పోటే కాదని ఆమె అంటున్నారు. అది లోకేష్ యాత్ర కాదని, జోకేష్ యాత్ర అని ఆమె అంటున్నారు….