బాబు మాట్లాడితే త‌ప్పు.. జ‌గ‌న్ మాట్లాడితే ఒప్పా.. స‌జ్జ‌ల స‌ర్‌!!

తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంపై ప్రెస్‌మీట్ పెట్టి సీఎం జ‌గ‌న్ పై విరుచుకుప‌డ్డారు. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కార‌మే తాము అమ‌రావ‌తిని ఏర్పాటు చేశామ‌ని.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్వ‌యంగా వ‌చ్చి శంకుస్థాప‌న కూడా చేశార‌ని.. అలాంటి దానిని స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని.. ఆయ‌న జ‌గ‌న్‌ పై విరుచుకుప‌డ్డారు. అంతే కాదు.. ఇక్క‌డి ర‌హ‌దారుల‌ను కూడా త‌వ్వేస్తున్నార‌ని అన్నారు.

అయితే.. దీనిపై తాజాగా కౌంట‌ర్ ఇచ్చిన ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం రాజధాని అంశంపై అఫిడవిట్ వేసిందని, ప్ర‌స్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు ప‌రిధిలో ఉన్నందున చంద్ర‌బాబు అలా మాట్లాడ‌డం న్యాయ‌మేనా? అని ప్ర‌శ్నించారు. మ‌రి ఇదే సూత్రం సీఎం జ‌గ‌న్‌కు ఎందుకు వ‌ర్తించ‌ద‌ని టీడీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. డిల్లీ ప‌ర్య‌ట‌న‌లో కొన్ని రోజుల కిందట సీఎం జ‌గ‌న్ రాజ‌ధాని త్వ‌ర‌లోనే విశాఖ‌కు వెళ్లిపోతుంద‌ని ప్ర‌క‌టించిన విష‌యాన్ని వారు గుర్తు చేశారు.

త‌మ‌కు ఒక న్యాయం.. సీఎం జ‌గ‌న్‌కు ఒక న్యాయం ఉంటుందా? అని ఎదురుదాడి చేశారు. ఇదిలావుంటే.. సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అమరావతి తాము గుర్తించిన రాజధాని అని కేంద్రం అనకపోయినా చంద్ర‌బాబు అండ్ కోలు దుష్ప్రచారం.. రాద్ధాంతం చేస్తున్నారని విరుచుకుప‌డ్డారు. చంద్రబాబు దీనిని అడ్డు పెట్టుకుని సీఎం జ‌గ‌న్‌ పై తిట్లు, శాపనార్థాలు పెడుతున్నారని అన్నారు. చంద్రబాబు తన స్థాయి మరచిపోయి మాట్లాడారని విమ‌ర్శించారు.

జగన్ అప్ప్పుడైనా ఇప్పుడైనా ప్రభుత్వ భూమి ఎక్కువగా రాజధానికి ఉండాలని చెప్పారని స‌జ్జ‌ల వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని విషయంలో చాలా స్పష్టంగా ఉందన్నారు. పునర్విభజన చట్టంలో చెప్పిన ప్రకారమే సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిందని కేంద్రం ఇచ్చిన అఫిడ‌విట్‌ను సజ్జ‌ల స‌మ‌ర్థించుకున్నారు. శివరామకృష్ణన్ కమిటీ వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపుతూ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. రాజధానిని చంద్రబాబు బంగారు బాతుగా భావించారని మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు.