మ‌రిదిపై వ‌దిన పోటీ.. గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి కొత్త ఎత్తు!

రాజ‌కీయాల్లో పేకాట త‌ర‌హా సూక్తులు వినిపించ‌డం కొత్త‌కాదు. అన్న‌మీద త‌మ్ముడు.. అక్క‌పై చెల్లి పోటీ చేసిన సంద‌ర్భాలు ఈ దేశంలో కామ‌న్‌. అలానే తండ్రి, త‌న‌యులు కూడా పోటీ చేసిన సంద‌ర్భాలు ఏపీలోనే ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకుంటోంది. కర్ణాటకలో క‌ళ్యాణ రాజ్య ప్ర‌గ‌తి ప‌క్ష‌ పేరుతో కొత్త పార్టీ స్థాపించిన మైనింగ్ కింగ్‌ గాలి జనార్దన రెడ్డి.. తన తమ్ముడిపై భార్యను పోటీకి దింపనున్నట్లు ప్రకటించారు.

ఎవరినో ఓడించేందుకు తాము పోటీ చేయడం లేదన్న ఆయన.. నెల రోజుల వయసున్న పార్టీతో రాష్ట్రంలోని నాయకులకు నిద్ర లేకుండా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మ‌రో మూడు మాసాల్లో జ‌ర‌గ‌నున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం పక్కా వ్యూహం తో ముందుకెళ్తున్నారు. కల్యాణ రాజ్య ప్రగతి పేరుతో పార్టీ స్థాపించిన ఆయన.. పోటీకి దిగే అభ్యర్థులపై తీవ్ర కసరత్తు చేస్తున్నా రు. ఇందులో భాగంగా బళ్లారి-సిటీ నియోజకవర్గంలో తన భార్య అరుణ లక్ష్మిని పోటీకి దించనున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం ఈ స్థానానికి బీజేపీలో ఉన్న జనార్దన రెడ్డి తమ్ముడు గాలి సోమశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ మ‌ళ్లీ సోమ‌శేఖ‌ర‌రెడ్డికి ఇదే టికెట్ ఇస్తే.. బ‌ళ్లారి సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌దిన‌-మ‌రిదిల పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంద‌న్న‌మాట‌. ఇదిలావుంటే, గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతున్నారు. తాను గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు మరోసారి స్పష్టం చేశారు.

కుటుంబ స‌భ్యుల మ‌ధ్యే పోటీ!

జనార్దన రెడ్డి సోదరులైన కరుణాకర రెడ్డి, సోమశేఖర రెడ్డి ఇప్పటికీ బీజేపీలోనే కొనసాగుతున్నారు. కరుణాకర రెడ్డి హరపనహళ్లి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరితో పాటు గాలి సన్నిహితుడైన కర్ణాటక మంత్రి శ్రీరాములు సైతం బీజేపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీజేపీ.. రానున్న ఎన్నికల్లో సోమశేఖర రెడ్డిని బళ్లారి నుంచే బరిలోకి దించితే కుటుంబ సభ్యుల మధ్య పోరుకు తెరతీసినట్లవుతుంది.