సీన్ రివ‌ర్స్‌.. దిగొచ్చిన కేసీఆర్‌.. గ‌వ‌ర్న‌ర్ స్పీచ్‌కు ఓకే!

తెలంగాణ‌లో సంచ‌ల‌నం రేపిన గ‌వ‌ర్న‌ర్ వ‌ర్సెస్ బీఆర్ఎస్ ప్ర‌భుత్వ వివాదం.. దాదాపు స‌మ‌సిపోయింది. అనూహ్యంగా గ‌వ‌ర్న‌ర్‌పై హైకోర్టును ఆశ్ర‌యించిన రాష్ట్ర ప్ర‌భుత్వం.. త‌నంత‌ట త‌నే వెన‌క్కి త‌గ్గింది. 2023-24 వార్షిక‌ బడ్జెట్‌ను గవర్నర్ త‌మిళి సై ఇప్పటి వరకు ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కేసీఆర్‌ ప్రభుత్వం స‌ద‌రు పిటిష‌న్‌ను వెనక్కి తీసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి సైతం అంగీకరించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. దీంతో ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌ ప్రవేశపెట్టే అంశం, గవర్నర్‌ ప్రసంగంపై ఓ స్పష్టత వచ్చింది.

2023-24 వార్షిక బ‌డ్జెట్‌కు ఆమోదం తెల‌పాల‌ని ప్ర‌భుత్వం, బ‌డ్జెట్ స‌మావేశాల్లో తొలిరోజు త‌న ప్ర‌సంగం ఉండాల‌ని గ‌వ‌ర్న‌ర్ ప‌ట్టుబ‌ట్టిన నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సూచనలతో ప్రభుత్వం, రాజ్భవన్ న్యాయవాదుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఫలితంగా రాష్ట్ర బడ్జెట్‌ ఆమోదం విషయంలో తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. బడ్జెట్‌ను గవర్నర్‌ ఇప్పటి వరకు ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

బడ్జెట్ సమావేశాలకు గడువు దగ్గర పడుతున్నా.. గవర్నర్ ఆమోదం లభించలేదు. మ‌రో రెండు మూడు రోజుల్లో వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ వైఖ‌రిపై ఒకింత గంద‌ర‌గోళ ప‌డిన స‌ర్కారు తాడో పేడో తేల్చుకునేందుకు ప్ర‌య‌త్నించింది. ఈ క్ర‌మంలోనే ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఉదయం విచారణ ప్రారంభమైన తరువాత.. 2.30కు వాయిదా పడింది. ఆ సమయంలో సీజే ధర్మాసనం సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్‌ తరఫు న్యాయవాదులు దుష్యంత్‌ దవే, అశోక్‌ ఆనంద్‌లు జరిపిన చర్చలు ఫలించాయి.

అనంత‌రం, చర్చల్లో పరిష్కారం లభించిందని ఇరు పక్షాల న్యాయవాదులు ఆ తరువాత ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల రాజ్యాంగబద్ధ నిర్వహణకు నిర్ణయించుకున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి అంగీకరించినట్లు ఇరుపక్షాల న్యాయవాదులు తెలిపారు. గవర్నర్‌ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు గవర్నర్‌ అనుమతిస్తారన్నారు. ఇరువైపుల న్యాయవాదుల సమ్మతితో హైకోర్టు విచారణ ముగించింది.