బీజేపీ అధిష్టానంపై కన్నా గేమ్ ప్లాన్

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కొత్త గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారు. అధిష్టానంపై వత్తిడి తేచ్చే ప్రక్రియను మరింత పటిష్టం చేశారాయన. ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గం భేటీకి ఆయన వెళ్లలేదు. ఢిల్లీ వెళ్లకుండా తిరుపతి కొండ ఎక్కారు. భీమవరంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గం భేటీకి కూడా కన్నా హాజరు కాలేదు. ఎందుకు వెళ్లలేదో తర్వాత చెబుతానంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.

అనుచరుల హల్ చల్
కన్నా అనుచరులు ఇప్పుడు ఆయన తరపున హల్ చల్ చేస్తున్నారు. ఆయన్ను గౌరవించకపోతే బీజేపీ నుంచి మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని గుంటూరులో ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. ఇదంతా కన్నా ఆశీస్సులతోనే జరుగుతోందని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కన్నా కార్యక్షేత్రం కూడా గుంటూరే. ఆయన గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెద కూరపాడు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు.

వీర్రాజుపై ఆగ్రహం

కన్నా లక్ష్మీ నారాయణకు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అంటే అసలు గిట్టడం లేదు. తన స్థానంలో వచ్చి కూర్చున్నారన్న కోపం ఒకటైతే, రాష్ట్ర బీజేపీలో తనవారిని పక్కన పెట్టారన్న ఆగ్రహం మరోటి. ఇటీవలే సోమూ వీర్రాజు పార్టీ జిల్లా అధ్యక్షులను మార్చారు. అందులో భాగంగా పదువులు కోల్పోయిన వారిలో ఎనిమిది మంది కన్నా అనుచరులున్నారు. అందుకే ఇప్పుడు కన్నా కోపం పార్టీ మీద కంటే వీర్రాజు మీద ఎక్కువ ఉందని చెబుతున్నారు..

సత్తెనపల్లి ఆఫర్

కన్నా ఒకప్పుడు పెదకూరపాటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు పక్కనున్న సత్తెనపల్లిపై కన్నేశారని చెబుతున్నారు. కన్నాను జనసేన ఆహ్వానిస్తోంది. ఆయన జనసేనలో చేరిన పక్షంలో సత్తెనపల్లిని కేటాయిస్తారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. పైగా టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే సత్తెనపల్లిని జనసేనకు వదిలేసేందుకు చంద్రబాబు ఒప్పుకున్నారట. అందుకే అక్కడ టీడీపీ ఇంఛార్జ్ ని కూడా పెట్టలేదు. ఇప్పుడు సత్తెనపల్లిలో జనసేన బాగా క్రీయాశీలమైంది. ప్రస్తుత ఎమ్మెల్యే అయిన ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు పట్ల జనంలో వ్యతిరేకత పెరుగుతోంది. సత్తెనపల్లిలో పార్టీలు, సామాజిక వర్గం సమీకరణాలను లెక్క చూస్తే కన్నా గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని లెక్కలేసుకుంటున్నారు. అన్ని ఆలోచేంచే కన్నా అలిగారని చెబుతున్నారు…