రమణదీక్షితుల హవా ముగిసినట్టేనా?

తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పేరు మరోసారి వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో మాజీ సీఎం చంద్రబాబుపై రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు గుప్పించారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యు చేశారు. చంద్రబాబు హయాంలో 20 మందికి పైగా అర్చకులను రాజ్యాంగ విరుద్ధంగా రిటైర్ చేయించారని ఆరోపించారు. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలను టీటీడీ ఈవో అనిల్ సింఘాల్, ఏఈవో పాటించడం లేదంటూ విమర్శించారు. ఇప్పటికీ వారిద్దరూ చంద్రబాబు ఆదేశాలను పాటిస్తున్నారంటూ కామెంట్స్ చేశారు.

ఆ వ్యాఖ్యలతోపాటు రమణ దీక్షితులు తాజాగా ఓ సంచలన ట్వీట్ చేశారు. స్వామి వారి కైంకర్యాలు నిర్వహించే 50 మంది అర్చకులలో 15 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ తేలిందని, అయినప్పటికీ .. ఈవో, అదనపు ఈవో దర్శనాలు అపడం లేదని ఆరోపించారు. మరో 25 మంది అర్చకులకు కరోనా పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని, కేసులు పెరుగుతున్నా దర్శనాలు ఆపకపోవడం అర్చకులపై ఈవో, అదనపు ఈవోలకు ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తోందని అన్నారు. తన ట్వీట్‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ట్యాగ్ చేశారు.

ఈ నేపథ్యంలోనే టీటీడీ పాలకమండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని అర్చక బృందం కలిసింది. భక్తులు వలన అర్చకులకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలిపారు. క్యూ లైనుకు సమీపంలో అర్చకులు విధులు నిర్వహించడం లేదన్నారు. ఆరోగ్య రీత్యా అర్చకులకు బదిలీ సౌకర్యం కల్పించాలని టీటీడీ అనుమతి కోరామన్నారు. రమణ దీక్షితులు ట్వీట్ పై వైవీ స్పందించారు. టీటీడీ విషయంలో రమణ దీక్షితులు రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు.

టీటీడీ బోర్డుకు సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చని, కానీ మీడియాలో మాట్లాడటం సరికాదని వైవీ అన్నారు. అర్చకుల విషయంలో టీటీడీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని వైవీ వెల్లడించారు ఒకవేళ అర్చకులకు ఇబ్బంది కలిగితే దర్శనాలు నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నామని వైవీ స్పష్టం చేశారు. కొండపై భక్తుల కారణంగా కరోనా సోకలేదని, కాబట్టే దర్శనాలు నిలిపివేయాల్సిన అవసరం లేదని అన్నారు. టీటీడీలో కరోనా సోకిన 140 మంది ఉద్యోగులలో 70మంది కోలుకున్నారని తెలిపారు.

మరోవైపు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్‌ డిప్యుటేషన్ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింఘాల్ పదవీకాలం 2019లో ముగియడంతో…మరో ఏడాది పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. తాజాగా రెండోసారి పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. కాగా, ఈవో అనిల్ సింఘాల్ పై సీఎం జగన్ కు గతంలోనే రమణ దీక్షితులు ఫిర్యాదు చేశారు. ఇంకా ఆయన చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు.

ఆ వ్యవహారం పెండింగ్ లో ఉండగానే…అర్చకులకు కరోనా సోకే అవకాశముందంటూ నేరుగా వైఎస్ జగన్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో, రమణ దీక్షితులు వ్యవహారశైలిపై సీఎం జగన్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ రఘు రామకృష్ణంరాజు తరహాలోనే రమణ దీక్షితులు నేరుగా మీడియా…సోషల్ మీడియాలోకి రావడంతో జగన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే అనిల్ సింఘాల్ పదవీకాలం పొడిగింపు, రమణ దీక్షితులు వైఖరిపై వైవీ స్టేట్ మెంట్ వచ్చాయని తెలుస్తోంది. రఘురామకృష్ణరాజులా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టిన రమణదీక్షితులకు పరోక్షంగా జగన్ నోరుమూయించారన్న టాక్ రాజకీయ వర్గాల్లో వస్తోంది.

చంద్రబాబును తిట్టినా కూడా వైఎస్ జగన్ కు రమణ దీక్షితులు దగ్గర కాలేకపోయారన్న ప్రచారం జరుగుతోంది. రమణదీక్షితుల హవా ముగిసినట్టేనా? అన్న చర్చ జరుగుతోంది. వైవీ సుబ్బారెడ్డి స్పందన, అనిల్ సింఘాల్ వ్యవహారంలో జగన్ చర్యతో రమణ దీక్షితులు తర్వాతి అడుగు ఏమిటన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.