తెలంగాణపై బాబు టోన్ మారలేదు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కూసుమంచి మండలం కేశవాపురంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీనేన‌ని చంద్ర‌బాబు అన్నారు. పార్టీకి పూర్వవైభవంతోపాటు శ్రేణుల్లో నూతనోత్తేజం నింపడమే లక్ష్యంగా పార్టీ నాయ‌కులు ప‌నిచేయాల‌ని బాబు సూచించారు. అనేక అభివృద్ధి ప‌నుల‌తో తెలంగాణ‌ను తీర్చిదిద్దామ‌ని చంద్ర‌బాబు చెప్పారు.

ఈ రోజు హైద‌రాబాద్ పురోగామి ప‌థంలో ప‌య‌నిస్తోందంటే.. దీనికి టీడీపీనే కార‌ణ‌మ‌ని చంద్ర‌బాబు చెప్పారు. రాష్ట్రానికి ప్ర‌ధాన ఆదాయం హైద‌రాబాద్ నుంచే వ‌స్తోంద‌న్న ఆయ‌న‌.. ప్ర‌భుత్వం అప్పులు చేయాల్సిన ప‌రిస్థితిలేకుండా హైద‌రాబాద్ కాపాడుతోంద‌ని అన్నారు. అదేస‌మ‌యంలో ఖమ్మం జిల్లాను కూడా తీర్చిదిద్దామని చంద్ర‌బాబు గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఐటీ స్థాపించామని చెప్పారు. అప్పట్లో సెల్‌ఫోన్‌ బువ్వ పెడుతుందా అని ఎగతాళి చేశారని.. ఇప్పుడు సెల్‌ఫోన్ లేకుండా ఎవరూ ఉండటం లేదని తెలిపారు.

ఎన్టీఆర్ తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టారు. ఎన్టీఆర్‌ విగ్రహం ముందు తీసుకున్న ఏ సంకల్పమైనా నెరవేరుతుంది. టీడీపీ స్థాపించి 40 ఏళ్లు కావొస్తుంది. తెలుగు వాళ్ల అభివృద్ధి కోసమే టీడీపీ పనిచేస్తుంది. తెలంగాణ అయినా, ఏపీ అయినా.. తెలుగువారి అభివృద్ధి కోసం పనిచేస్తాం. అని చంద్ర‌బాబు నొక్కి చెప్పారు.

తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో ఖమ్మం నగరమంతా జెండాలు, హోర్డింగ్లు, ఫ్లెక్సీలతో పసుపుమయంగా మారింది. ఉమ్మడి ఖమ్మం సహా రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను సమీకరించారు.