టీడీపీ కి జ‌గ‌న్ లాగా చేసే ధైర్యం వుందా?

ఔను.. రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌ను చూసుకుని, వారి వేస్తున్న‌వ్యూహాల‌ను చూసుకుని కుళ్లుకుంటే ఏమొస్తుం ది? గుజ‌రాత్‌లో ఇదే జ‌రిగింది. బీజేపీ వేస్తున్న ఎత్తుగ‌డ‌లు చూసుకుని.. కాంగ్రెస్ పార్టీ కుళ్లుకుంది. ఓటు వేసి.. ప్ర‌ధాని మౌనంగా రాకుండా.. ర్యాలీగా వ‌చ్చార‌ని, ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేశార‌ని.. ఇది త‌ప్పుకాదా! అని మీడియాకు స్టేట్‌మెంట్లు ఇచ్చింది. ప‌త్రిక‌ల్లోనూ ఘ‌నంగానే ఈ వార్త వ‌చ్చింది.

కానీ, ఏం జ‌రిగింది. బీజేపీ గెలిచింది. మోడీ అలా చేసిన‌ప్పుడు.. కాంగ్రెస్ నాయ‌కులు కూడా అలానే చేస్తే స‌రిపోయేదిక‌దా? టిట్ ఫ‌ర్ టాట్ అన్న‌ట్టు.. త‌మ నేత‌ల‌ను కూడా రంగంలోకి దింపి.. ఓటేసిన త‌ర్వాత‌.. ముందు కూడా ర్యాలీగా వెళ్లి హంగామా చేయిస్తే.. అంతో ఇంతోబాగానే ఓట్లు ప‌డేవిక‌దా! లేక ఏదైనా ఘ‌ర్ష‌ణ జ‌రిగితే.. అప్పుడు ఎలానూ మోడీ ఇలా చేశాడు కాబ‌ట్టి.. మేం చేశామ‌ని చెప్పుకొనేందుకు ఛాన్స్ ఉండేది.

కానీ, మోడీని చూసి కుళ్లుకుని.. ఒళ్లు హూనం చేసుకుంది. ఇక‌, ఏపీలోనూ వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌లంటీర్ల‌ను ప‌క్క‌న పెట్టి గృహ సార‌థుల‌ను ప్ర‌వేశ పెడుతున్నారు. వీరు పూర్తిగా పార్టీకి ప‌నిచేస్తారు. దాదాపు ఐదున్న‌ర ల‌క్ష‌ల మందిని రంగంలోకి దింపుతున్నారు. ప్ర‌తి ఇంటికీ వెళ్లేలా బ్లూప్రింట్ రెడీ చేసుకున్నారు. ప్ర‌తి ఓటునూ ఒడిసి ప‌డుతున్నారు. మంచిదే.. దీనిని త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. రాజ‌కీయంగా ఆయ‌న‌కు ఉన్న స్వేచ్ఛ‌ను వాడుకుంటున్నారు.

దీనిని చూసి టీడీపీ కానీ, వామ‌ప‌క్షాలు కానీ, కాంగ్రెస్ కానీ, కుళ్లు కోవాల్సిన అవ‌స‌రం లేదు. జ‌గ‌న్ ఏదో త‌ప్పు చేస్తున్నాడ‌ని చెప్పి.. చేతులు దులుపుకొని ప‌త్రిక‌ల్లో వ‌చ్చే వార్త‌లు చ‌దువుకుని బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా స‌మ‌యం ఉంది. సో.. ఆయా పార్టీలు కూడా వ‌లంటీర్ల‌ను పెట్టి.. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పంపిస్తే.. కాద‌నేవారు ఎవ‌రుంటారు? వ్యూహానికి ప్ర‌తి వ్యూహం వేస్తే.. అడ్డుకునేవారు ఎవ‌రు ఉంటారు. అడ్డుకుంటే.. ఎలానూ న్యాయ‌స్థానాలు ఉన్నాయి. సో.. ఇప్పుడు కావాల్సింది… జ‌గ‌న్‌ను చూసి కుళ్లు కోవ‌డం కాదు.. అత‌నికి మించిన ఎత్తు వేసి.. పై ఎత్తుల‌తో అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే!