జ‌గ‌న్ ను స‌రిగా పెంచ‌మ‌ని వైఎస్‌కు చెప్పా.. చంద్ర‌బాబు

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మెడ మీద క‌త్తి పెట్టి ఆస్తులు రాయించుకునే ర‌క‌మ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. గ‌తంలో వైఎస్ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడే.. జ‌గ‌న్ గురించి హెచ్చ‌రించిన‌ట్టు చెప్పారు. నీ కొడుకును స‌రిగా పెంచు. మా అబ్బాయి విదేశాల్లో చ‌దువుతున్నాడు. మీ అబ్బాయిని కూడా విదేశాల‌కు పంపించావు. జాగ్ర‌త్త‌! అని అసెంబ్లీలోనే వైఎస్‌కు చెప్పిన‌ట్టు తెలిపారు. కానీ, వైఎస్ త‌న మాట‌ను ప‌ట్టించుకోలేద‌ని, ఫ‌లితంగా విదేశాల‌కు వెళ్లిన జ‌గ‌న్ మ‌ధ్య‌లోనే దొంగ విమానం ఎక్కి వ‌చ్చేశాడ‌ని చంద్ర‌బాబు ఎద్దేవా చేశారు.

మైనారిటీల‌పై వ‌రాల జ‌ల్లు..

గుంటూరు జిల్లా పొన్నూరులో మైనారిటీల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైన చంద్ర‌బాబు.. బాత్‌చీత్‌ విత్ బాబు కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తూనే షరతులు లేని దుల్హన్ పథకం అమలు చేసి వివాహం రోజునే ముస్లిం మైనార్టీ పెళ్లికుమార్తెకు రూ.లక్ష ఆర్థికసాయాన్ని అందిస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. నాలెడ్జ్ ఎకానమీలో ముస్లిం మైనార్టీ విద్యార్థుల వెనకబడకూడదనే విదేశీ విద్య పథకం తీసుకొచ్చి అమలు చేశామ‌న్నారు. రూ.10 లక్షలు ఆర్థికసాయం అందజేసి ప్రపంచంలో ఏ యూనివర్సిటీలోనైనా చదువుకునే అవకాశం కల్పించిన‌ట్టు చెప్పారు.

టీడీపీ తిరిగి ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక మైనారిటీల‌కు విదేశీ విద్య పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ 1985 లోనే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ని స్థాపించి పేద ముస్లింలకు పైకి తీసుకొచ్చేందుకు ఆర్థికసాయం అందించామ‌న్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉర్దూని ద్వితీయ భాషగా ప్రకటించాన‌న్నారు. హైద‌రాబాద్‌ హజ్ హౌస్ స్థాపించి ముస్లింలకు రూ.60 వేల చొప్పున ఆర్థికసాయం చేసి యాత్రకు పంపించిన విష‌యాన్ని గుర్తు చేశారు. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీని స్థాపించామన్నారు.

విజయవాడ, కడపలోనూ హజ్ హౌస్‌ల‌ నిర్మాణానికి నిధులు ఇచ్చి పనులు ప్రారంభిస్తే ఈ సీఎం జగన్ వాటిని పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నార‌ని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. టీడీపీ అధికారంలో ఉండగా 10 లక్షల మంది రంజాన్ తోపా అందుకున్నార‌ని తెలిపారు. హైదరాబాద్ లో ఒకప్పుడు మతకలహాలు, కర్వ్యూలు ఉం డేవని, టీడీపీ హయాంలో మతసామరస్యం పెంపొందించి కర్ఫ్యూ లేకుండా చేశామని గుర్తు చేశారు.

సీఎం జగన్ రూ.10 ఇచ్చి రూ.100 కొట్టేసే టైప‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ముస్లింలకు ప్రత్యేకంగా ఒక్క స‌బ్ ప్లాన్‌ అయినా పెట్టాడా ? అని ప్ర‌శ్నించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించింది టీడీపీనేన‌న్న చంద్ర‌బాబు ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంద‌ని తెలిపారు. ఇమాం, మౌజన్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధికి కూడా నిధులు ఇచ్చింది టీడీపీనేన‌న్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం తప్పు జరగనివ్వవద్దని మైనారిటీల‌కు చంద్ర‌బాబు సూచించారు.