వాపు తగ్గిన ఆప్…కేజ్రీవాల్ జైత్రయాత్రకు బ్రేక్?

ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు కనిపించడం లేదు. ఆప్ హడావుడి ఢిల్లీ, పంజాబ్ కే పరిమితమవుతోంది. కేజ్రీవాల్, సిసోడియా మాటలు జనం నమ్మేందుకు సిద్ధంగా లేరని తేలిపోయింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో ఆప్ తన ప్రాబల్యాన్ని విస్తరించలేకపోయిందని తాజా ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి.

దశాబ్దం క్రితం 2012లో ఏర్పాటైన ఆప్… రాజధాని ఢిల్లీకే పరిమితమవుతుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. అన్నా హజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేకోద్యమం నుంచి పుట్టిన ఆప్ ను సమర్థంగా నడిపించడంలో మాజీ ఐఆర్ఎస్ అధికారి అరవింద్ కేజ్రీవాల్ సక్సెస్ అయ్యారు. ఢిల్లీలో మూడో సారి అధికారానికి తీసుకురాగలిగారు. ఆ క్రమంలో రెండు ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ను రాజధానిలో దెబ్బకొట్టగలిగారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన ఉచిత కరెంట్, తాగు నీటి హామీలను కూడా నెరవేర్చారు. దానితో ఆమ్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించారు. అందులో కొంతమేర కాంగ్రెస్ స్వయం కృతం కూడా ఉందని చెప్పాలి. అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిని.. బంగారు పళ్లెంలో పెట్టి మరీ అధికారాన్ని ఆప్ కు అప్పగించింది…

అవినీతి ఆరోపణలే దెబ్బకొట్టాయా ?

రెండేళ్లుగా ఆప్ ఢిల్లీ నేతలపై ఏదోక అవినీతి ఆరోపణ వస్తూనే ఉంది. నాయకులు జైలుకు వెళ్తున్నారు. కారాగారంలో సైతం వారి తీరును జనం అనుమానించే వీడియోలు బయటపడుతున్నాయి. సరిగ్గా గుజరాత్, హిమాచల్ ఎన్నికలకు ముందే ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపడింది. అవినీతిలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి కూడా ఆ స్కాములో భాగస్వామి అని దర్యాప్తు సంస్థలు తేల్చాయి.ఈ పరిణామాల ప్రభావం ఎన్నికలపై కనిపించిందని సర్వేలు నిగ్గుతేల్చాయి. రెండు రాష్ట్రాల్లోనూ అవినీతి ఎన్నికల అంశమేనని జనం ఒప్పుకున్నారు. ఆప్ కూడా ఇతర పార్టీల్గాగే స్కాముల పార్టీగా మారిందన్న అనుమానాలు బలపడ్డాయి. అవినీతి సొమ్మును తీసుకొచ్చి ఎన్నికల్లో ఖర్చుపెడుతున్నారని బీజేపీ ప్రచారం ఫలించింది. వెరసి రెండు రాష్ట్రాల్లో ఆప్ ఘోరంగా ఓడిపోతోంది…

క్షేత్రస్థాయిలో విస్తరించలేకపోయిన ఆప్

ఎన్నికలు జరిగిన రెండు రాష్ట్రాల్లో ఆప్ కింది స్థాయి నుంచి విస్తరించలేకపోయిందని తాజా సర్వేలు చెప్పకనే చెబుతున్నాయి. అడపా దడపా కేజ్రీవాల్, సిసోడియా వచ్చి ప్రచారం చేసి వెళ్లడం మినహా….సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్ట లేదు. అదే ఇప్పుడు గుజరాత్ లో పార్టీని దె్బ్బకొట్టింది. నాయకులు బాగానే పనిచేశారని, కార్యకర్తలు లేకపోవడంతో పోలింగ్ బూత్ స్తాయిలో వెళ్లలేకపోయామని ఆప్ నేతలు అంటున్నారు….

మోదీ రాష్ట్రంలో బీజేపీని ఓడించడం అంత సులభం కాదని కూడా తాజా ఎన్నికలు తేల్చేశాయి. నరేంద్రుడు ప్రధానిగా ఉన్నంతకాలం గుజరాతీయులు అయనకు మద్దతిస్తూనే ఉంటారు. మనవాడు ఢిల్లీలో ఉన్నాడు, ఆయనకు ఇబ్బందులు సృష్టించకూడదని రాష్ట్ర ప్రజల ఆలోచనగా చెప్పాల్సి ఉంటుంది. అందుకే గుజరాత్ లో ఆప్ దూసుకుపోలేని స్థితికి చేరింది.. 

కాంగ్రెస్ ను దెబ్బకొట్టిందా ?

గుజరాత్ ఎలా ఉన్నా హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్ విజయావకాశాలను ఆప్ దెబ్బకొట్టిందనే చెప్పాలి. అక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. కరెక్టుగా చెప్పాలంటే ఒక్క శాతం లోపే ఉండొచ్చు. అందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గెలవాల్సిన కాంగ్రెస్ ఓట్లను ఆప్ చీల్చిందని అందుకే గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఓడిపోతోందని చెబుతున్నాయి. 

ఢిల్లీ కార్పొరేషన్లో ఊరట 

రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినప్పటికీ ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికల్లో తన సత్తా చూపిందని ఎగ్జిట్‌ పోల్స్‌ తెలిపాయి. 2007 నుంచి కార్పొరేషన్‌ను గెలుస్తూ వచ్చిన బీజేపీకి ఇది గట్టి విఘాతంలా భావిస్తున్నారు. 250 వార్డుల్లో ఆప్‌ మూడింటా రెండో వంతు సీట్లను గెలుచుకుంటుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. రాజధాని రాష్ట్రంలో ఆప్ కు తిరుగులేదని ఈ ఎన్నికలు నిరూపించాయి. అంతవరకు మంచిదే కదా…