సీఎం జగన్‌ రాయలసీమ ద్రోహి: చంద్ర‌బాబు

సెల్‌ఫోన్‌ అనే ఆయుధంతో సీఎం జగన్‌ ప్రభుత్వ అరాచకాలను, వైఫల్యాలను అందరికీ చెప్పాలని.. ప్రజలకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. దీనికి అందరూ బాధ్యత తీసుకోవాలన్న ఆయన.. ఇది ప్రజాస్వామ్య పోరాటానికి నాంది కావాలన్నారు. సీఎం జగన్‌ రాయలసీమ ద్రోహి అని నిప్పులు చెరిగిన చంద్రబాబు.. వైసీపీ గూండాలతో తన పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. అరాచకాలు ఆపకపోతే ప్రజలే జగన్‌ను తరిమికొడతారన్న నిప్పులు చెరిగారు.

కర్నూలు జిల్లాలో మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వ‌చ్చిన చంద్ర‌బాబు రెండోరోజు మ‌రింత ఉత్సాహంగా ముందుకు సాగారు. చంద్ర‌బాబ‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రెండో రోజు ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో నిర్వహించిన రోడ్‌షో, బహిరంగ సభలకు భారీ స్పందన వచ్చింది. ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామంలో పత్తి రైతులతో మాట్లాడి, వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో చేనేత కార్మికుడి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు.

ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందట్లేదని కార్మికుడు చెప్పగా, తాను అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ఆస్తులన్నీ వైసీపీ నేతల చేతుల్లోకే వెళ్తున్నాయన్న ఆయన.. రాజధాని పేరుతో విశాఖలో 40 వేల కోట్ల భూములను కొల్లగొట్టారని ఆరోపించారు.

జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రుల్లో ఒకరు బుర్రకథలు బాగా చెబుతారని ఎద్దేవా చేసిన చంద్రబాబు.. మరొకరు అక్రమ వ్యాపారాలతో నిత్యం తీరిక లేకుండా ఉంటారంటూ చురకలంటించారు. రాయలసీమకు జగన్‌ తీరని అన్యాయం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. ఈ మూడున్నరేళ్లలో ఏం చేశారో చెప్పాలని సవాల్‌ విసిరారు. ఎమ్మిగనూరులో చంద్రబాబు కాన్వాయ్‌పైకి కొందరు రాళ్లు విసిరారు.

పర్యటనలో తనను అడ్డుకునేందుకు యత్నించిన వారిపై ఆగ్రహం వ్యక్తంచేసిన చంద్ర‌బాబు గూండాలతో రాళ్లు వేయించాలని చూస్తే ఖబర్దార్‌ అని హెచ్చరించారు. అవినీతి జగన్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించి వేయాలని అన్నారు. రాష్ట్రంతో పాటు యువత భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు.