బాలయ్య ‘అన్‌స్టాపబుల్‌’లో షర్మిళ?

ఇప్పుడు తెలుగులో నంబర్ వన్ టాక్ షో ఏది అంటే మరో మాట లేకుండా ‘అన్‌స్టాపబుల్’ పేరు చెప్పేయొచ్చు. ఓటీటీలో టాక్ షో ఏంటి.. అందులోనూ బాలయ్య హోస్ట్ ఏంటి.. ఎవరు చూస్తారు ఈ షో అన్న వాళ్లంతా కూడా ఇప్పుడు ఆ షోకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. అలా ప్రశ్నించిన వాళ్లు కూడా ఆ షోకు అడిక్ట్ అయిపోతున్నారు. ఆ స్థాయిలో షోకు రెస్పాన్స్ తీసుకొచ్చారు మేకర్స్,

బాలయ్య. రెండో సీజన్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తూ తొలి ఎపిసోడ్లోనే మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌లను అతిథులుగా తీసుకొచ్చి సంచలన విషయాలపై చర్చతో షో లెవెలే మార్చేశారు. తర్వాత విశ్వక్సేన్-సిద్ధు జొన్నలగడ్డ జోడీ కూడా బాగానే సందడి చేసింది. వచ్చే వారం అడివి శేష్-శర్వానంద్ జోడీ హంగామా కూడా బాగానే ఉన్నట్లుంది. కాగా ఇప్పుడు ఈ షోలో పాల్గొనే కొత్త గెస్ట్ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ తెలంగాణ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అయిన వైఎస్ షర్మిళ ‘అన్‌స్టాపబుల్’లో పాల్గొనబోతున్నట్లు వస్తున్న ఊహాగానాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

ఒకప్పుడు అన్న జైల్లో ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేందుకు 2 వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేసిన షర్మిళ.. తర్వాత జగన్ తనకు అన్యాయం చేశాడన్న కారణంతో ఆయన్నుంచి దూరంగా వచ్చి తెలంగాణలో వైఎస్సార్ టీపీ పార్టీ పెట్టింది. జగన్ ఎప్పుడూ బద్ద శత్రువుగా భావించి ఏబీఏఎన్ రాధాకృష్ణకు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం రేపింది. ఇటీవలి పరిణామాలు చూసినా జగన్‌కు, షర్మిళకు పడట్లేదని స్పష్టంగా తెలిసిపోతోంది. ఈ నేపథ్యంలో ‘అన్‌స్టాపబుల్’ను కొంత మేర తన రాజకీయ ప్రయోజనాలకు కూడా ఉపయోగించుకుంటున్న బాలయ్య షర్మిళను షోకు తీసుకొచ్చి జగన్‌ను టార్గెట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ షో చివరి ఎపిసోడ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అతిథిగా వస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పవన్ వచ్చినా జగన్‌ను టార్గెట్ చేస్తారని వేరే చెప్పాల్సిన పని లేదు. అంతకంటే ముందు నిజంగా షర్మిళ వచ్చేట్లయితే జగన్ మీద ఎలాంటి బాంబులు వేస్తుందో.. తమ కుటుంబ కలహాల గురించి ఏం చెబుతుందో చూడాలి మరి. షర్మిళ ఈ షోకు రావడం నిజమే అయితే మరి కొన్ని రోజుల్లోనే దీని గురించి అధికారిక సమాచారం బయటికి వచ్చేయొచ్చు.