మీరు వాడుకోండి.. జ‌గ‌న‌న్న క‌డ‌తాడు!

Peddi Reddy
Peddi Reddy

అదేంటి? అనుకుంటున్నారా? ఔను.. నిజ‌మే.. ఏపీలో విద్యుత్ విష‌యంపై.. ప్ర‌భుత్వం ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేసింది. రాబోయే సంవత్సరం మార్చి నుంచి వ్యవసాయ మోటర్లకు విద్యుత్ మీటర్ల ఏర్పాటును పూర్తి చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా వెల్ల‌డించారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. విద్యుత్ మోటర్ల ద్వారా రైతులకు లబ్ది చేకూరుతుందని అన్నారు. విద్యుత్ మీటర్ల ఏర్పాటు పక్రియకు టెండర్లు పిలవనున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలోపు మీటర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందన్నారు.

వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేసేందుకు సవరించిన అంచనాల మేరకు ఆరు వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తున్నామని.. టెండర్ల ప్రక్రియ జ్యుడీషియల్ సమీక్ష స్థాయిలో ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేయటం ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. నాణ్యమైన విద్యుత్ పొందడం రైతులకు హక్కన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా 18 వేల వ్యవసాయ మోటార్లకు ఏర్పాటు చేసిన మీటర్ల ద్వారా మూడో వంతు విద్యుత్‌ పొదుపు చేయగలిగామన్నారు.

అయితే.. మీట‌ర్లు పెట్టినా.. బిల్లులు మాత్రం ప్ర‌భుత్వ‌మే క‌డుతుంద‌ని.. మంత్రి చెప్ప‌డం గ‌మ‌నార్హం. మీట‌ర్ల ద్వారా వాడిన విద్యుత్ కు ఎంత అవుతుందో.. అంత మొత్తాన్ని.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫ‌ర్ ద్వారా.. రైతుల ఖాతాల్లోకి నిధులు ప్ర‌భుత్వం జ‌మ‌చేస్తుంద‌న్నారు. అయితే.. దీనిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మీట‌ర్ల‌కు టెండ‌ర్లు పిల‌వ‌డం.. ద్వారా.. త‌న అనుయాయుల‌కు సీఎం జ‌గ‌న్ వీటిని క‌ట్ట‌బెట్ట‌నున్నార‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న విధానాన్ని తీసేసి.. సొమ్మును వారి ఖాతాల్లోకి జ‌మ చేసుకునే వ్యూహాన్ని సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంద‌ని.. ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. ఈ ప‌థ‌కంపైనా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వం కూడా.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫ‌ర్ అంటూ.. వంట గ్యాస్‌పై ఉన్న స‌బ్సిడీని మేం .. త‌ర్వాత‌.. మీ బ్యాంకు అకౌంట్ల‌కు జ‌మ చేస్తాం.. మీరు మాత్రం ముందు పూర్తి మొత్తం(అంటే.. స‌బ్సిడీ లేకుండా) చెల్లించాల‌ని.. తెలిపింది. దీనిపై అనేక ఆరోప‌ణ‌లు.. వ‌చ్చినా.. ఉద్య‌మాలు వ‌చ్చినా..లెక్క‌చేయ‌కుండా.. ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి మ‌రీ. అమ‌లు చేసింది. ఇప్పుడు ఏం జ‌రుగుతోంది? అంటే.. అస‌లు స‌బ్సిడీనే ఎత్తేసిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ముందు డ‌బ్బులు క‌ట్టించుకుని.. త‌ర్వాత‌.. రెండు నెల‌ల‌కు ఒక‌సారి వేసేవారు. అది కూడా.. రూ.10, రూ.15 వ‌ర‌కు వ‌చ్చింది. ఇప్పుడు అది కూడా లేదు.

సో.. ఇప్పుడు జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన ఈ ప‌థ‌కం కూడా.. అంతే అవుతుంద‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముందు రైతులు త‌మ మీట‌ర్ల‌కు వ‌చ్చిన బిల్లులు క‌ట్టేయాల‌ని.. త‌ర్వాత‌.. వాటిని జ‌గ‌న్ స‌ర్కారు వారి ఖాతాల్లోకి జ‌మ చేస్తుంద‌ని మంత్రి చెబుతున్నారు. రేపు స‌ర్కారు ద‌గ్గ‌ర డ‌బ్బులు లేక‌పోతే.. ప‌రిస్థితి ఏంటి? ఎగ్గొట్టేస్తారా? అనేది ప్ర‌శ్న‌. ఇక‌, ఈ టెండ‌ర్ల ప్ర‌క్రియ ద్వారా.. అయిన వారికి వీటిని క‌ట్ట‌బెట్టి.. వారికి ప్ర‌జ‌ల సొమ్మును ధారా ద‌త్తం చేస్తారా? అనేది మ‌రో ప్ర‌శ్న‌. ఏదేమైనా.. దీనిపై అనేక విమ‌ర్శ‌లు అయితే వ‌స్తున్నాయి.