అప్పుడు బాబు ఇరుక్కున్నట్లే ఇప్పుడు జగన్?

2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును ఇరుకున పెట్టిన అంశాలు చాలానే ఉన్నాయి. అందులో ప్రధానంగా ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన అంశం.. ప్రత్యేక హోదా. ముఖ్యమంత్రి అయిన కొత్తలో కొంత కాలం పాటు ప్రత్యేక హోదా డిమాండ్‌ను గట్టిగా వినిపించిన బాబు.. అది సాధ్యం కాదని మోడీ సర్కారు తేల్చేయడంతో, దాని స్థానంలో అంతే ప్రయోజనాలు చేకూర్చే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ప్రత్యేక హోదా గురించి మీడియా వాళ్లు, జనాలు అడిగితే తూచ్ అనేశారు. గద్దించారు. కట్ చేస్తే జగన్ ప్రత్యేక హోదాను ఎన్నికల అంశంగా మార్చి దాని విషయంలో చంద్రబాబు చేయాల్సిన డ్యామేజ్ అంతా చేశారు. ఎన్నికలు దగ్గరపడేసరికి బాబు యుటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. 

ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి మోడీ సర్కారు మీద యుద్ధం ప్రకటించారు. మళ్లీ ప్రత్యేక హోదా డిమాండ్‌ను ఎత్తుకుని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం మొదలుపెట్టారు. ఐతే ఈ యుటర్న్ వల్ల బాబు క్రెడిబిలిటీ బాగా దెబ్బ తింది. పైగా సాధ్యం కాని హోదా డిమాండ్‌ను నెత్తికెత్తుకుని.. తనకు తాను చాలా డ్యామేజ్ చేసుకున్నారు. హోదా సాధించలేని విఫలవ్యక్తిగా ఎన్నికలకు వెళ్లారు. తర్వాత ఏం జరిగిందన్నది అందరికీ తెలిసిందే.

ఐతే అప్పుడు ప్రత్యేక హోదా తాలూకు చిక్కుముడిలో పడి చంద్రబాబు ఎలా దెబ్బ తిన్నాడో ఇప్పుడు వైఎస్ జగన్ వికేంద్రీకరణ-మూడు రాజధానులు అనే అంశాన్ని నెత్తికెత్తుకుని దెబ్బ తినబోతున్నాడనే అభిప్రాయాల్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించినపుడు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి.. ఆ తర్వాత యుటర్న్ తీసుకుని, దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం.. మూడేళ్లుగా దీని మీదే రాజకీయం చేస్తూ ఇటు అమరావతిలో, అటు విశాఖలో ఏమీ చేయకుండా ఉండిపోవడం, ఇప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చు రేగేలా ఈ అంశాన్ని మరింత రాజకీయం చేస్తుండటం జగన్ సర్కారుకు డ్యామేజ్ చేసేలాగే కనిపిస్తోంది. 

ఎండ్ ఆఫ్ ద డే జనాలు చూసేది ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం అసలేం సాధించింది, ఏం అభివృద్ధి చేసిందని. అమరావతికి సంబంధించి గత ప్రభుత్వం వీలైనంత మేర అభివృద్ధి చేసినా.. చివరికి అప్రతిష్ట పాలైంది. అలాంటిది జగన్ ప్రభుత్వ హయాంలో అక్కడ అభివృద్ధి ఆగిపోగా.. కొత్త రాజధానులుగా ప్రకటించిన విశాఖపట్నం, కర్నూలుల్లో కొత్తగా ఒక్క ఇటుక కూడా పడే పరిస్థితి కనిపించడం లేదు. సోషల్ మీడియా వేదికగా ఎవరు పోల్ పెట్టినా రాజధానిగా అమరావతి వైపే మొగ్గు ఉంటోంది. మూడు రాజధానులకు ఓటస్తున్న వాళ్లు తక్కువ. విశాఖ గర్జన లాంటి కార్యక్రమాలకు బలవంతంగా జనాలను తరలించి హడావుడి చేశారే తప్ప.. నిజంగా విశాఖను రాజధానిని చేసే విషయంలో అక్కడి వారిలో అనుకున్నంత సానుకూలత కనిపించట్లేదనిపిస్తోంది.

ఇటీవల వెలుగు చూసిన భూ దందాలను చూస్తుంటే స్వార్త ప్రయోజనాల కోసమే విశాఖను రాజధానిగా ఎంచుకున్నారనే అభిప్రాయం బలపడుతోంది. మొత్తంగా చూస్తే మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర స్థాయిలో సానుకూల స్పందన లేదని తెలిసినా.. ఆ స్టాండ్ తీసుకున్నారు కాబట్టి అలాగే ఎన్నికలకు వెళ్లాలని జగన్ అండ్ కో భావిస్తున్నట్లు అర్థమవుతోంది. మరి గత పర్యాయం బాబును ప్రత్యేక హోదా అంశం దెబ్బ కొట్టినట్లే.. మూడు రాజధానుల అంశం జగన్‌కు ఝలక్ ఇస్తుందేమో చూడాలి.