జగన్ చేసింది తప్పే: షర్మిల

ఏపీ రాజకీయాల్లో తాజా వివాదంపై ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి మీద భగ్గముంటున్న విషయం తెలిసిందే. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరును మార్చేసి ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టింది. అసెంబ్లీ, శాసనమండలిలో అధికారపార్టీ ప్రవేశపెట్టిన తీర్మానాలు మెజారిటి కారణంగా ఆమోదం కూడా పొందేశాయి. దాంతో యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు స్ధానంలో డాక్టర్ వైఎస్సార్ పేరొచ్చేసింది. జగన్ తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీలోను బయటా టీడీపీతో పాటు ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా మండిపోతున్నాయి.

సరే జగన్ తీసుకునే ప్రతీనిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతునే ఉంటాయి. ఏ ఒక్క నిర్ణయానికి కూడా ప్రభుత్వానికి ప్రతిపక్షాలు మద్దతివ్వలేదు. సరే ఏపీ రాజకీయాలు ఇలాగే ఉంటాయని అనుకుంటే ఇపుడు చెల్లెలు వైఎస్ షర్మిల కూడా జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటు నిలదీశారు. ఎన్టీయార్ పేరును తీసేయటం వల్ల దానికున్న పవిత్రత దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం మారినపుడల్లా అప్పటికే ఉన్న పేర్లను తీసేసి కొత్తపేర్లు పెడుతుపోతే జనాల్లో అయమోయం వచ్చేస్తుందన్నారు. 1998 నుండి హెల్త్ యూనివర్సిటికి ఉన్న ఎన్టీయార్ పేరును తీయాల్సిన అవసరం ఏమొచ్చిందో ప్రభుత్వం సరిగా వివరించలేకపోయిందని షర్మిలన్నారు. అంటే అసెంబ్లీలో జగన్ చెప్పిన కారణంతో షర్మిల ఏకీభవించటంలేదని అర్ధమవుతోంది.

నిజానికి హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ తీసి వైఎస్సార్ పేరు పెట్టడం వల్ల పార్టీకైనా ప్రభుత్వానికైనా వచ్చే లాభం ఏమీలేదు. పైగా పేరు తీసేయటం వల్ల ఎంతోకొంత నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. అధికారభాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగానే తప్పుపట్టారు. నిజానికి వీళ్ళిద్దరిదీ కమ్మ సామాజికవర్గమే అయినా జగన్ కు ఎంతో సన్నిహితులుగా ఉన్నారు. అలాంటి వాళ్ళే జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. కాబట్టి అదునుచూసి షర్మిల కూడా జగన్ పై బండ వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.