ఔను .. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ మేధావులు ఇదే ప్రశ్న సంధిస్తున్నారు. కశ్మీర్పై కేంద్రంలోని పాలకులకు ఉన్న మోజు.. ఏపీ…. తెలంగాణలపై ఎందుకు లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజక వర్గాల పెంపును ఇప్పటికే చేయాల్సిన అవసరం ఉంది. ఈ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజక వర్గాలను పెంచాలి. కానీ, ఇంత వరకూ ఆ ప్రక్రియను మొదలు పెట్టలేదు.
2014నాటి విభజన చట్టం ప్రకారం.. ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లను 225కి, తెలంగాణలోని 119 సీట్లను 153కి పెంచాల్సి ఉంది. ఈ చట్టంలోని సెక్షన్ 26లో ఈ మేరకు పేర్కొన్నారు కూడా. కానీ, ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రక్రియను మొదలు పెట్టలేదు. అయితే.. అదేసమయంలో గత ఏడాది జరిగిన జమ్ము కశ్మీర్ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న నిబంధన మేరకు అక్కడ నియోజక వర్గాలను పెంచడానికి డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
వాస్తవానికి అదే నిబంధన ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నా కేంద్రం తగిన చర్యలు తీసుకోలేదు. జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ సీట్లను పెంచుతున్నప్పుడు ఏపీ, తెలంగాణల్లో ఎందుకు పెంచడం లేదన్నది ప్రధాన ప్రశ్న. ఇది రాజ్యాంగంలోని 14, 19, 21వ అధికరణలను ఉల్లంఘించడమేనని మేదావులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టు కు ఎక్కింది.
ఒక్క జమ్ము కశ్మీర్ మాత్రమే కాదు.. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల్లోనూ నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణకు కలిపి ఒకే నోటిఫికేషన్ను కేంద్రం జారీ చేయడం మరింత వివాదంగా మారింది. జమ్ము కశ్మీర్కు 2011 జనాభా లెక్కల ఆధారంగా, మిగతా నాలుగు రాష్ట్రాల్లో 2001 జనాభా లెక్కల ఆధారంగా పునర్వ్యవస్థీకరించాలని పేర్కొంది.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలంగాణలో నియోజక వర్గాలను పెంచాలని రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ కేంద్రాన్ని టీఆర్ఎస్ సర్కారు విజ్ఞప్తి చేస్తూనే ఉంది. అయితే, నియోజక వర్గాల పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ఆధారంగానే నియోజక వర్గాలను పునర్వ్యవస్థీకరిం చాలన్న సీలింగ్ ఉందని చెబుతోంది. కేంద్ర న్యాయ శాఖ కూడా గతంలో ఒకసారి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ వాదనను టీఆర్ఎస్ తిప్పికొడుతోంది.
రాజ్యాంగంలోని 3వ అధికరణ మేరకే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిందని, తద్వారా, రాజ్యాంగంలోని అన్ని అంశాలను సవరించినట్లేనని, ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణ అవసరం లేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. జమ్ము కశ్మీర్ విభజన చట్టం 2019లో పేర్కొన్న నిబంధన మేరకు ఎటువంటి రాజ్యాంగ సవరణ లేకుండానే అక్కడ సీట్ల పెంపునకు కేంద్రం డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేయడాన్ని గుర్తు చేస్తున్నారు.
అయితే.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే నియోజక వర్గాల పెంపు అంశం ముందుకు సాగడం లేదని రాజకీయ వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. రాజకీయంగా లాభనష్టాలను బీజేపీ బేరీజు వేసుకుంటుందని, నియోజక వర్గాలు పెంచితే తమకు అనుకూలమని అంచనాకు వస్తేనే ఈ అంశంపై ముందుకెళ్లే అవకాశముందని భావిస్తున్నాయి. అప్పటి వరకూ కేంద్రం కాలయాపన చేస్తూనే ఉంటుందని చెబుతున్నాయి.
తెలంగాణలో నియోజక వర్గాలు పెరిగితే రాజకీయంగా తమకు నష్టం జరుగుతుందని బీజేపీ నేతలు సైతం పలుమార్లు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజక వర్గాల్లోనే మెజారిటీ స్థానాల్లో తమ పార్టీకి బలమైన అభ్యర్థులు లేరని, నియోజక వర్గాలను పెంచితే బలమైన అభ్యర్థులు దొరకడం కష్టతరమని అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ఏపీలోనూ అంచనాలు వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మోడీ సర్కారు తనకు నచ్చిన రాష్ట్రం కశ్మీర్లో ఒక విధంగా.. ఏపీ, తెలంగాణల్లో మరో విధంగా వ్యవహరిస్తోందని మేధావులు చెబుతున్నారు.
This post was last modified on September 20, 2022 2:55 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…