బీజేపీని జూనియర్ ఆదుకోగలరా?

రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నది వాస్తవం. వామపక్షాలు, కాంగ్రెస్ పరిస్థితి ఎలాగుందో బీజేపీ పరిస్ధితి కూడా అదే విధంగా ఉంది. కాకపోతే కమలనాథులు ప్రతి చిన్న విషయానికి ఎగెరిగెరి పడుతున్నారు. కారణం ఏమిటంటే కేంద్రంలో అధికారంలో ఉండటమే తప్ప మరోటి కాదు. మరి ఇంటి పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామన్న బిల్డప్ ఇస్తోంది. దీనికి కారణం ఏమిటంటే జూనియర్ ఎన్టీయార్ లాంటివాళ్ళ తమకు సేవలందించటానికి సిద్ధంగా ఉన్నట్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు చెప్పటమే.

వీర్రాజు మాటలు విన్న తర్వాత తమను జూనియర్ గట్టెక్కించేస్తారనే ఆశలు చాలా ఎక్కువగానే పెట్టుకున్నట్లున్నారు. మరి వీర్రాజు ఆశలు నిజాలవుతాయా ? అన్నది ఇక్కడ కీలకమైన పాయింట్. ఇక్కడ గమనించాల్సిందేమంటే జూనియర్ సేవలందించినంత మాత్రాన బీజేపీకి ఓట్లు పడిపోవు, సీట్లు వచ్చేయవు. ఎందుకంటే జనాల్లోనే బీజేపీ అంటే విపరీతమైన మంటుంది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్నారు.

విభజన హామీల్లో కీలకమైన ప్రత్యేక హోదా, వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ లాంటి అంశాలను కూడా దెబ్బ కొట్టేశారు. ఇక వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసేస్తున్నారు. ఇలాంటి అనేక అంశాల్లో ఏపీని ఒకవైపు దెబ్బకొడుతు మరోవైపు జూనియర్ సేవలందిస్తారు, మరొకరు సేవలందించటానికి సిద్ధంగా ఉన్నారంటే ఉపయోగమేముంటుంది. 2009లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా జూనియర్ సుమారు 130 నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

అప్పట్లో అంత శ్రమ తీసుకుని జూనియర్ ప్రచారం చేస్తే ఏమైంది ? ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో కూడా టీడీపీ గెలవలేదు. జూనియర్ వల్ల ఓట్లు వస్తే వస్తాయేమో కానీ అభ్యర్ధి గెలవటమన్నది సాధ్యం కాకపోవచ్చు. నిజానికి జూనియర్ కన్నా ఫ్యాన్ బేస్ పవన్ కల్యాణ్ కే చాలా ఎక్కువుంది. మరంత అభిమానులున్నా పోటిచేసిన రెండు నియోజకవర్గాల్లోను పవన్ ఎందుకు ఓడిపోయినట్లు? కాబట్టి జూనియర్ మీద ఆశలు పెట్టుకోకుండా రాష్ట్రానికి మంచి చేస్తే జనాలే పార్టీని ఆదరిస్తారని కమలనాథులు తెలుసుకోవాలి.