టీఆర్ఎస్ కొత్త తీరు.. ఛోటా నేతలకు భారీ ధర!

మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం తెలంగాణ అధికారపక్షం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తోంది. తమకున్న అధికార బలాన్ని ప్రదర్శించటమే కాదు.. ధనబలాన్ని చూపేందుకు సైతం వెనుకాడటం లేదు. ఇందులో భాగంగా సరికొత్త ఎత్తులకు తెర తీస్తోంది. మొత్తంగా తెలంగాణలో సరికొత్త రాజకీయాన్ని టీఆర్ఎస్ పరిచయం చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఈ ఉప పోరు ఫలితం.. తెలంగాణ భవిష్యత్తు రాజకీయాల్ని ప్రభావితం చేసే వీలు ఉండటంతో తమ ప్రత్యర్థులైన బీజేపీ.. కాంగ్రెస్ లకు ఏ చిన్న అవకాశాన్ని వదలకూడదని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ ఎన్నికల్లో కీలకమైన ఛోటా నేతలపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన టీఆర్ఎస్ పార్టీ వారు ఊహించలేనంత భారీ ఆపర్లను ఇస్తున్నట్లు చెబుతున్నారు. గుండుగుత్తుగా ఓట్లను ప్రభావితం చేసే సత్తా ఉన్ననేతల జాబితాను సిద్ధం చేసి.. వారిలో పలువురికి రూ.10 లక్షల చొప్పున ఇచ్చేందుకు సైతం సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ ను వదిలి టీఆర్ఎస్ లో చేరిన 11 మంది సర్పంచ్ లు.. ఏడుగురు ఎంటీపీసీలు పార్టీలో చేరేందుకు సిద్ధమైన వేళ.. వారికి మద్దతుగా తరలి వచ్చే వారికి  ఒక్కొక్కరికి రూ.500.. క్వార్టర్ మందుతో పాటు.. బిర్యానీలు ఇచ్చేందుకు తయారైనట్లుగా తెలుస్తోంది.

మునుగోడు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడకుండానే ఇలాంటి పరిస్థితి ఉండటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. నోటిఫికేషన్ వచ్చే నాటికి తమ బలాన్ని ప్రదర్శిచటంతో పాటు.. ప్రత్యర్థి పార్టీలపై ఒత్తిడి పెంచేందుకు వీలుగా.. పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్కు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా ద్వితీయ శ్రేణి నేతలు.. ఛోటా నేతలు గులాబీ కారులోకి ఎక్కితే లభించే ప్రయోజనం భారీగా ఉండేలా ‘ప్లాన్లు’ సిద్ధం చేసినట్లుగా సమాచారం.

ఇందులో భాగంగా ఓటర్లను ప్రభావితం చేసే సత్తా ఉన్న వారికి రూ.10లక్షలు ఇచ్చేందుకు సిద్ధమైన పరిస్థితి. వారు పార్టీలో చేరేందుకు ఓకే చెప్పినంతనే ఈ భారీ మొత్తం వారికి అందజేయాలన్న ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. చూస్తుంటే.. మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. రోజులు గడిచేకొద్దీ ఇలాంటివి మరెన్ని సిత్రాలు తెర మీదకు వస్తాయో?