షాతో చంద్రబాబు.. తెలంగాణ మీటింగ్?

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో చంద్రబాబునాయుడు భేటీ అవుతున్నారా ? మీడియా రిపోర్టుల ప్రకారం అవుననే అనుకోవాలి. 21వ తేదీన మునుగోడులో బహిరంగసభలో పాల్గొనేందుకు అమిత్ షా వస్తున్నారు. ముందుగా ప్రకటించి అమిత్ పర్యటన ప్రకారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుని నేరుగా మునుగోడుకు వెళ్ళాలి. అక్కడ బహిరంగసభ చూసుకుని ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగి హైదరాబద్ చేరుకోవాలి. హైదరాబద్ లో కొందరు నేతలతో కాసేపు మాట్లాడుకుని ఢిల్లీకి వెళ్ళిపోతారు.

అయితే షా పర్యటనలో మార్పులు జరిగినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మునుగోడు నుండి తిరిగి హైదరాబాద్ కు హెలికాప్టర్లో కాకుండా రోడ్డుమార్గాల వస్తారని. ఎందుకంటే మధ్యలో రామోజీ ఫిల్మ్ సిటిలో కాసేపు అమిత్ షా ఆగుతారట. ఫిల్మ్ సిటీలో ఆగటం ఎందుకంటే రామోజీరావు, చంద్రబాబుతో సమావేశం అవ్వటానికే అని ప్రచారం జరుగుతోంది. బహుశా రెండురాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ మధ్య పొత్తుల విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్నారు.

బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు  ప్రయత్నిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ లేదా పార్లమెంటులో బిల్లులకు కానీ అడగకుండానే టీడీపీ ఎన్డీయేకి మద్దతు ప్రకటిస్తోంది. నరేంద్రమోడీతో మళ్ళీ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో లబ్దిపొందాలన్నది చంద్రబాబు ఆలోచన. పొత్తులు పెట్టుకోవటం, విడిపోవటం చాలాపార్టీల మధ్య జరుగుతున్నదే. కాబట్టి చంద్రబాబు ఆలోచనను తప్పు పట్టాల్సిందే మీ లేదు.

ఏపీ కన్నా ముందు తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణాలో ఎన్నికలతో పాటు ఇపుడు మునుగోడు ఉపఎన్నికలో తన ఓట్లన్నింటినీ బీజేపీకి వేయించేట్లుగా చంద్రబాబు హామీ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అంటే తెలంగాణాలో బీజేపీకి చంద్రబాబు సహకరించాలి. అలాగే ఏపీలో చంద్రబాబుకు బీజేపీ సహకరించాలనేది ఒప్పందమట. ఇదే ఖాయమైతే తెలంగాణాలో బీజేపీకి ఏమేరకు సహకరించగలదు ? అలాగే ఏపీలో బీజేపీకి ఏముందని టీడీపీకి సహకరిస్తుందనేది ఎన్నికల్లో కానీ తేలదు. మొత్తానికి ఏపీలో మిత్రపక్షాలతో టీడీపీ కలవటం మంచిదే.