మునుగోడుకు ఒక్కసారిగా పెరిగిపోయిన డిమాండ్

ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ లేదు. అయినప్పటికి మునుగోడు ఉప ఎన్నికల విషయంలో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. పెరుగుతున్న డిమాండ్ ఏమిటంటే ఇళ్ళకు, పంటపొలాలకు, ప్రచార రథాలకు, ఎన్నికల ప్రచారంలో పాల్గొనే జనాలకు, ప్రింటింగ్ ప్రెస్సులకు. ఇంతకీ విషయం ఏమిటంటే ఉపఎన్నిక నవంబర్ లేదా డిసెంబర్లో జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంటే మహా అయితే ఉపఎన్నికకు మరో నాలుగు నెలల వ్యవధి ఉంది.

ఉపఎన్నికలో గెలవటం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలకు అత్యంత ప్రతిష్టగా మారింది. దాంతో పార్టీలు తమ శక్తియుక్తులన్నింటినీ నియోజకవర్గంలోనే కేంద్రీకరిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రచారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. మరి ప్రచారం చేసుకోవాలంటే పార్టీ ఆఫీసులు తెరవాలికదా. ప్రచారంలో పాల్గొనే నేతలు, కార్యకర్తలకు బస, వసతి చూడాలి కదా. ఇవన్నీ ఎవరు చూడాలంటే అభ్యర్ధే చూడాలి. ఎందుకంటే అవసరం పార్టీలకు ఎంతవసరమో అభ్యర్ధులకీ అంతే అవసరం కాబట్టి.

అందుకనే బీజేపీ అభ్యర్థిగా పోటీచేయబోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ ఇంచార్జ్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి వీలైనన్ని ఇళ్ళను అద్దెలకు తీసేసుకుంటున్నారు. తన మద్దతుదారుల కోసం రాజగోపాల్ ఇప్పటికే చౌటుప్పల్, మునుగోడు హెడ్ క్వార్టర్స్ లో 15 ఇళ్ళను అద్దెకు తీసేసుకున్నారట. డిమాండును దృష్టిలో పెట్టుకుని యజమానులు అద్దెలను కూడా బాగా పెంచేస్తున్నారట. రు. 10 వేలున్న డబల్ బెడ్ రూం ఇల్లు ఇపుడు రు. 20 వేలు చెబుతున్నారట.

ఇక కమర్షియల్ గా సింగిల్ షట్టర్ ఉన్న గది అద్దె 10 వేల నుండి 15 వేల రూపాయలు చెబుతున్నారట. అలాగే ప్రచార సామగ్రి తయారుచేసే వాళ్ళకు కూడా ఫుల్లుగా డిమాండ్ పెరిగిపోతోందట. ఇక రైతులు అయితే తమ పొలాలను అద్దెలకు ఇస్తున్నారట. బహిరంగసభలు నిర్వహించాలంటే కనీసం 20 ఎకరాలు అవసరం. ప్రతిపార్టీ కనీసం ఐదు బహిరంగసభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. దాంతో రైతులు ఎకరాకు ఇంతాని డబ్బులు మొత్తాన్ని ముందుగానే తీసేసుకుంటున్నారట. పార్టీలతో పొలాలను కొంతకాలానికి లీజుకు ఇస్తున్నట్లు అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నారట. మొత్తానికి ఉపఎన్నిక పుణ్యమాని అంతా డిమాండ్ పెరిగిపోతోంది.