టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ.. దొందు దొందే..

పైకి రెండు పార్టీలు కూడా క‌త్తులు నూరుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీని దించేయాల‌ని.. ప్ర‌తిప‌క్షంగా టీడీపీ, అస‌లు టీడీపీని నామ‌రూపాలు లేకుండా చేయాల‌ని.. వైసీపీ.. ఇలా.. రెండు పార్టీలు.. ఒక దానిపై మ‌రొక‌టి వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నాయి. కానీ, అంత‌ర్గ‌తంగా వ‌చ్చేస‌రికి మాత్రం రెండు పార్టీల్లోనూ నాయ‌కులు క‌ట్టుత‌ప్పుతున్నార‌నే వాద‌న మాత్రం జోరుగా వినిపిస్తోంది.. క‌నిపిస్తోంది కూడా! ఈ విష‌యంలో రెండు పార్టీలు కూడా దొందు దొందే అన్న‌ట్టుగా ఉన్నాయి.

వైసీపీ విష‌యాన్ని చ‌ర్చిస్తే.. అధినేత‌పైనే బ‌హ‌రంగ విమ‌ర్శ‌లు చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు పెరుగుతున్నారు. నేరుగా జ‌గ‌న్ పేరు పెట్టి తిట్టే ధైర్యం నాయ‌కుల‌కు లేక‌పోయినా.. ప‌థ‌కాల పేరుతో.. ప్ర‌భుత్వం పేరుతో.. అధికారుల పేరుతో.. తిట్టిపోస్తున్నారు. అభివృద్ధి లేద‌ని.. విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అప్పులు త‌ప్ప రాష్ట్రానికి మిగిలింది ఏంట‌ని.. అధికార పార్టీ నాయ‌కులే.. విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక‌, ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌తంగానూ.. దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అటు మ‌హిళ‌ల విష‌యంలోనూ.. ఇటు సొంత పార్టీ నాయ‌కుల విష‌యంలోనూ.. వైసీపీ నేత‌లు.. త‌మ ఇష్టం.. తాము ఏం చేసినా.. కాద‌నేవారు ఎవ‌రు.. అనే ధోర‌ణిలోనే ముందుకు సాగుతున్నారు.

అయితే.. వీరిని క‌ట్ట‌డి చేయాల్సిన జ‌గ‌న్ .. కేవ‌లం .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చేదిలేదు.. మీ ఆట‌లు ఇలానే సాగితే.. అని హెచ్చ‌రించి చేతులు దులుపుకొంటున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి క‌దా.. అని నాయ‌కులు పెద‌వి విరుస్తూ.. ఇష్టారీతిన వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌ల జ‌గ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు.. ఇదే అన్నారు.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎవ‌రు ఏ పార్టీలో ఉంటారో.. ఎవ‌రికి తెలుసు అన్నారు. అంతేకాదు.. నేను కూడా ఎక్క‌డుంటానో నాకే తెలియ‌దు.. అనేశారు. దీనిని బ‌ట్టి పార్టీలో ఎంత క‌ట్టుబాటు ఉందో అర్ధ‌మ‌వుతుంది.

ఇక‌, టీడీపీలోనూ ఇంత‌కు భిన్న‌మైన ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. అధినేత ముందు పిల్లులు.. త‌ర్వాత పులులు అన్న‌ట్టుగా నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉండ‌రు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోరు. ఎవ‌రి వ్యాపారాలు.. ఎవ‌రి ప‌రిచ‌యాలు వారికి ఉన్నాయి. ప‌ట్టుమ‌ని ప‌ది మంది త‌ప్ప‌.. మిగిలిన వారంతా.. ఇదే ప‌నిచేస్తున్నారు. తాజాగా పార్టీ అధినేత ముందే.. విజ‌య‌వాడ ఎంపీ వ్య‌వ‌హ‌రించిన తీరు మ‌రింత విస్మ‌యానికి గురి చేసింది.

చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. ఆయ‌న‌కు ఆహ్వానం ప‌లికేందుకు.. మ‌రో ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్.. బొకే ఇవ్వ‌బోగా.. నాని.. చంద్ర‌బాబు ముందే.. దానిని ప‌క్క‌కు నెట్టేసిన వీడియో.. సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. అటు వైసీపీలోను.. ఇటు టీడీపీలోనూ.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌కు పెద్ద తేడాలేద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి వీరిని లైన్‌లో పెట్టేదెవ‌రు? అనేది ప్ర‌శ్న‌.