కాపీ టు ఎలక్షన్ కమిషన్ – రాజు భలే ఇరుకున పెట్టేశాడే..

రఘురామకృష్ణం రాజు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఎదురే లేనట్లు సాగిపోతున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారాయన. కొన్ని రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందరిని తూర్పారబట్టేస్తూ.. నాయకత్వాన్ని కూడా పూచికపుల్లలా తీసిపడేసేలా మాట్లాడేస్తున్నారాయన.

ఓవైపు సొంతంగా విడుదల చేసిన వీడియోలు.. మరోవైపు టీవీ చర్చల్లో ఆయన ధాటికి వైకాపా నాయకులు తట్టుకోలేకపోతున్నారు. ఈ విషయంలో కొన్నాళ్లు వేచి చూసే ధోరణిలో కనిపించిన పార్టీ అగ్ర నాయకత్వం.. తాజాగా ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి ప్రాథమికంగా రఘురామకృష్ణంరాజు బదులిచ్చిన తీరు చూస్తే.. ఆయన కొంచెం తగ్గినట్లే కనిపించారు. దుందుడుకు వైఖరి కట్టిపెట్టినట్లే కనిపించారు.

కానీ షోకాజ్ నోటీసుకు బదులిచ్చిన వైనం చూస్తే మాత్రం రఘరాముడితో అంత తేలిక కాదని అర్థమైపోయింది అందరికీ. తనకు షోకాజ్ నోటీసు ఇచ్చిన విజయసాయిరెడ్డికే దిమ్మదిరిగేలా తన జవాబును మొదలుపెట్టారాయన. ‘రాష్ట్ర ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శి’ అని పేర్కొనడం ద్వారా ఎద్దేవా చేసిన రఘురామకృష్ణంరాజు.. పార్టీ పేరు విషయంలో చేసిన వ్యాఖ్యలతో వైకాపాను బాగా ఇబ్బంది పెట్టేశారు. తాను ఉన్నది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో అయితే.. తనకు ‘వైఎస్సార్ కాంగ్రెస్’ అనే పార్టీ నుంచి షోకాజ్ నోటీస్ వచ్చిందేంటి అని ప్రశ్నించారాయన.

షోకాజ్‌ నోటీసులో అడిగిన ప్రశ్నలకు వివరణ ఇస్తారని అనుకుంటే.. పార్టీ పేరు విషయంలో అభ్యంతరాలు లేవనెత్తి.. తన జవాబును ఎలక్షన్ కమిషన్‌కు కూడా పంపడం ద్వారా వైకాపా నాయకత్వానికి నోట మాట లేకుండా చేశాడు రఘురామ కృష్ణంరాజు. దీంతో ఇప్పుడు పార్టీ పేరును మార్చి కొత్తగా షోకాజ్ నోటీసు ఇస్తారా.. లేదా సరైన వివరణ ఇవ్వనందుకు రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకుంటారా.. లేదా ఎందుకొచ్చిన తలనొప్పని ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి వైకాపాను రఘురామకృష్ణంరాజు ఓ రేంజిలో ఆడుకుంటున్నారన్నది మాత్రం వాస్తవం.