యువతలో పౌరుషం ఎందుకు రావటంలేదు ?

యువత, పేదల కోసమే తాను ప్రజలముందుకు వస్తున్నట్లు చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రజలకు జరిగే నష్టం నివారించటానికి, భవిష్యత్తరాల కోసమే తాను పోరాడుతుంటే యువతలో ఎందుకు పౌరుషం రావటంలేదంటు మండిపడ్డారు. యువత ముందుకు రావాలని తన పోరాటంలో భాగస్వాములు కావాలని చంద్రబాబు గట్టిగాకోరారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కడప జిల్లాలో పర్యటించారు. 72 ఏళ్ళ వయసులోను తాను చురుగ్గా పనిచేస్తుంటే యువతలో మాత్రం పౌరుషం కనిపించటంలేదన్నారు.

శ్రీలంక ప్రధానమంత్రిగా పనిచేసిన మహీంద రాజపక్సేకి పట్టిన గతే జగన్మోహన్ రెడ్డికి కూడా తప్పదని వార్నింగ్ ఇచ్చారు. మహీందను పోలీసులు కూడా కాపాడలేకపోయారని కాబట్టి ఇక్కడ కూడా జగన్ను పోలీసులు కాపాడలేరని చెప్పారు. జగన్ లాంటి నియంతకు తాను భయపడేదిలేదన్నారు. మూడేళ్ళ జగన్ పాలన పూర్తిగా వైఫల్యాలే అని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి వైసీపీ ప్రభుత్వం దోపిడీని వివరించాలని చెప్పారు.

అప్పులతో జగన్ రాష్ట్రం పరువు తీసేసినట్లు చెప్పారు. మూడేళ్ళల్లో జగన్ ప్రభుత్వం రు. 8 లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. గుంటూరుకు చెందిన వెంకాయమ్మ ప్రభుత్వం తీరుపై వాస్తవాలు చెబితే ఎందుకు దాడిచేశారంటు ప్రశ్నించారు. వైసీపీ ప్రకటించిన నలుగురు రాజ్యసభ అభ్యర్ధుల్లో ఇద్దరు టీడీపీ వాళ్ళే అంటు ఎద్దేవాచేశారు. తెలంగాణాకు చెందిన ఇద్దరికి ఏపీ కోటా నుండి ఎందుకు ఎంపికచేశారంటు నిలదీశారు. ఏపీలో సమర్ధులు లేరని తెలంగాణా నుండి ఎంపికచేశారా అంటు ఎద్దేవాచేశారు.

పులివెందులలో బస్టాండు కట్టలేని వాళ్ళు ఇక మూడు రాజధానులు కడతారా ? అంటు ప్రశ్నించారు. వైఎస్సార్ జిల్లా నుండే టీడీపీ జైత్రయాత్ర మొదలవ్వాలని పిలుపిచ్చారు. రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలని చెప్పారు. ప్రస్తుతం కడపజిల్లాలోని 10 అసెంబ్లీల్లో టీడీపీ ఒక్కటి కూడా గెలవలేదు. అలాగే రెండు లోక్ సభ సీట్లను కూడా వైసీపీనే గెలుచుకున్నది. మరి చంద్రబాబు పిలుపుమేరకు కడప జనాలు ఏ మేరకు స్పందిస్తారో చూడాలి.