సుప్రీంపై మోడీ సర్కార్ మండిపోతోందా ?

సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగిపోతోందా ? ఈ కారణంగానే సుప్రీంకోర్టు పై నరేంద్ర మోడీ సర్కార్ మండి పోతోందా ? అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా సుప్రీం-కేంద్ర ప్రభుత్వ మధ్య గ్యాప్ పెరగటానికి కారణం 124 ఏ సెక్షన్ అంటే రాజద్రోహం చట్టం. ఈ సెక్షన్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచక్షణారహితంగా పలువురిపై కేసులు నమోదు చేస్తున్నాయి. దీంతో రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలంటు దేశవ్యాప్తంగా గోల పెరిగిపోతోంది.

దీనిపై కేంద్ర మాజీ మంత్రితో పాటు పాత్రికేయులు, పలువురు ప్రముఖులు సుప్రింకోర్టులో కేసులు వేశారు. దాంతో సుప్రీంకోర్టు విచారణ మొదలు పెట్టింది. అయితే ఈ విచారణలో రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయటానికి కేంద్రం ఏ మాత్రం సుముఖంగా లేదు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ స్పష్టంగా చెప్పేశారు. అంటే రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయటానికి లేదా మార్పులు చేయటానికి కూడా కేంద్రం అంగీకరించలేదు.

కేంద్రంతో ఇక లాభం లేదనుకున్న సుప్రీం ప్రస్తుతానికి 124 ఏ చట్టం అమలును నిలిపేయాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ చట్టం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరెస్టయిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకునేందుకు లేదని చెప్పింది. ఇప్పటికే అరెస్టు చేసుంటే వారందరు బెయిల్ ద్వారా బయటకు వచ్చే వెసులు బాటును కల్పించింది.  అలాగే విచారణ పూర్తయ్యే వరకు ఎవరిపైనా రాజద్రోహం కేసులు నమోదు చేయద్దని చెప్పింది. అంటే రాజద్రోహం చట్టం విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం మోడీ సర్కార్ కు ఏ మాత్రం రుచించ లేదని అర్ధమైపోతోంది. ఈ చట్టం బ్రిటీష్ హయాంలో 1880లో తయారైంది.

ఈ చట్టం కింద అరెస్టయి జైళ్ళల్లో సుమారు 13 వేలమందున్నారు. ఇపుడు వాళ్ళందరికీ ఊరట లభించినట్లయ్యింది. 2015-20 మధ్య దేశంలో 548 మంది ప్రముఖులు వివిధ ఆరోపణలతో  ఈ చట్టం ద్వారా  అరెస్టయ్యారు. వీరిలో 6 మంది మాత్రమే ఆరోపణలు నిరూపణమయ్యాయి. మరి మిగిలిన వారి పరిస్ధితేంటి ? గతంలో కేంద్రం తయారు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను కూడా కేంద్రమే నిలిపేసింది. అలాగే పెగాసస్ స్పైవేర్ సాఫ్ట్ వేర్ వాడకంపైన దాఖలైన కేసుల్లో కూడా కేంద్రం సహకరించకపోయినా సుప్రింకోర్టే విచారిస్తోంది.