27 నుంచి ఆందోళ‌న‌లు.. చంద్ర‌బాబు మరో మాస్ట‌ర్ ప్లాన్‌

జగన్‌ ప్రభుత్వం తన అసమర్థతతో పోలవరాన్ని బలి చేసిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు అన్నారు. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింటే మూడేళ్లపాటు ప్రభుత్వం ఎందుకు దాచిందని ప్రశ్నించారు. పోలవరం అథారిటీ, కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టినా.. మూర్ఖంగా ముందుకు వెళ్లి ప్రాజెక్టును నాశనం చేశారని మండిపడ్డారు. డయాఫ్రమ్‌ వాల్‌ ఎలా కూలిందో చెప్పకుండా.. మాపై  ఆరోపణలు చేయొద్దన్నారు. సీపీఎస్‌ ఉద్యమంపై ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోందని అన్నారు. హక్కుల కోసం పోరాటలు చేస్తే అరెస్ట్‌ చేస్తారా? అని ప్రశ్నించారు.

విద్యా సంవత్సరాన్ని జూన్‌ 12 నుంచి జులై 8కి మార్చడమేంటి? అని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాల వల్లే ఏపీలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 800 మందిపై అత్యాచారాలు జరిగినా.. ఏ ఒక్కరికీ న్యాయ జరగలేదని చంద్ర‌బాబు అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. మహిళలకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 27న ఆందోళన కార్యక్రమాలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ ముఖ్యనేతలతో వ్యూహకమిటీ సమావేశం నిర్వహించిన ఆయన.. ప్రభుత్వ వైఫల్యంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు ప్రణాళికలు రచించినట్లు తెలిపారు.

మహిళలకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 27న ఆందోళన కార్యక్రమాలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 800 మందిపై అత్యాచారాలు జరిగినా.. ఒక్కరికీ న్యాయ చేయనందుకే ఆందోళన బాట పడుతున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై సీఎం జగన్ రెడ్డి ప్రతీకారం దుర్మార్గమని చంద్రబాబు ధ్వజమెత్తారు. న్యాయం కోసం రోడ్డెక్కితే నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తున్నారని మండిపడ్డారు. హక్కుల కోసం ఐక్య పోరాటం చేయడానికి సిద్ధపడితే అరెస్టులు చేస్తున్నారని దుయ్యబట్టారు. తమ హక్కుల కోసం ఉపాధ్యాయులు రోడ్డెక్కడం తప్పా ? అని చంద్రబాబు నిలదీశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంవత్సరాన్ని జూన్ 12 నుంచి జులై 8కి మార్చటాన్ని ఆయన తప్పుబట్టారు. పాఠశాలలు మూసివేయటం వంటి విధానాలతో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని విమర్శించారు. నెల్లూరులో మంత్రి కాకాణి కేసుకు సంబంధించిన సాక్ష్యాలు దొంగిలించడబడటం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిందని చంద్రబాబు ఆక్షేపించారు. నేరస్థులకు కొత్త నేరాలు చేయడానికి వైకాపా ప్రభుత్వం మార్గాలు చూపిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసినప్పటికీ తాగునీటి కష్టాలు ఎదురవడానికి ప్రభుత్వ అసమర్థ విధానాలే కారణమని ఆయన మండిపడ్డారు.

కుటంబంతో కలిసి తిరుమల వెళ్తున్న భక్తుల కారును బలవంతంగా లాక్కోవటమే కాకుండా.. ఇప్పుడు ఆ కుటుంబాన్ని విచారణ పేరుతో వేధించడం దారుణమని ఆక్షేపించారు. ఈ విషయంలో బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి.. నోటీసులతో వేధిస్తారా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం యుద్ధ ప్రాతిపాదికగా పూర్తి చేయాలని చంద్రబాబు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీతో ఉండే ప్రతి కుటుంబ సభ్యుడూ.. సభ్యత్వాన్ని తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. అనుబంధ కమిటీల్లో యువతకు అధిక ప్రాధాన్యం కల్పించడం.. గ్రామ స్థాయిలో అన్ని కమిటీల్లో యువత అధికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.