జై జ‌గ‌న్: మ‌రికొన్ని జిల్లాలు మ‌రిన్ని ప్ర‌తిపాద‌న‌లు!

జిల్లాలు వ‌ద్దు క‌నీసం రెవెన్యూ డివిజ‌న్లు ఏర్పాటు చేయండి చాలు అని చాలా చోట్ల వినిపిస్తున్న డిమాండ్. పబ్లిక్ డిమాండ్ ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా క‌నీసం  పేర్ల మార్పుపై కూడా దృష్టి నిల‌ప‌కుండా సీఎం జ‌గ‌న్ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల కార‌ణంగా చాలా మంది రాజ‌కీయ భవిష్య‌త్ అంధ‌కారం కావ‌డం ఖాయ‌మని అటు టీడీపీనే కాదు ఇటు వైసీపీ కూడా అంత‌ర్మ‌థ‌నంలో ఉంది. స్థానిక డిమాండ్లను ప‌రిష్క‌రించామ‌ని, ప‌దిహేడు వేల‌కు పైగా వ‌చ్చిన అభ్యంత‌రాల‌ను విన్నామ‌ని, వీలున్నంత చేశామ‌ని నిన్న‌టి వేళ జ‌గ‌న్ ఓ పత్రికా ప్ర‌క‌ట‌న రూపంలో చెప్పినా కూడా అవ‌న్నీ అబ‌ద్ధాలే అని తేలిపోయింద‌ని టీడీపీ ఆధారాల‌తో స‌హా చెబుతోంది.

మ‌రిన్ని నిర‌స‌న‌ల‌కు సిద్ధం అవుతోంది. ఈ ద‌శ‌లో చంద్ర‌బాబు మౌనంగానే ఉన్నారు. స్థానిక డిమాండ్ల సాధ‌న అన్న‌ది స్థానిక నేత‌ల స‌మ‌స్య‌గానే చూస్తున్నారా? అన్న అనుమానం ఈ విష‌య‌మై చంద్ర‌బాబు పై క‌ల‌గ‌క మాన‌దు. కేవ‌లం కొన్ని విష‌యాల‌పై మాట్లాడి మిగ‌తా వాటిపై మౌనం వ‌హించ‌డం పై అధినేత తీరు కాస్త సంశ‌యాత్మ‌కంగానే ఉంద‌ని టీడీపీ వ‌ర్గీయులు కొంద‌రు బాహాటంగానే పెదవి విరుస్తున్నారు. ఏదేమ‌యినప్ప‌టికీ తాము ప్ర‌జ‌ల త‌ర‌ఫున వాద‌న‌ను ప్ర‌గాఢ రీతిలో వినిపింప‌జేస్తామ‌ని సంబంధిత ప్రాంతాల నాయ‌కులు స్ప‌ష్టం చేస్తూ ఉన్నారు.

ఈ ద‌శ‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వివాదాలు రేగుతూనే ఉన్నాయి. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం విష‌య‌మై సీఎం జ‌గ‌న్ ఏమీ చేయ‌క‌పోయినా రోజా మాత్రం య‌థాలాపంగా థాంక్యూ సీఎం అంటూ ర్యాలీలు తీశారు. అంత‌టి వీర విధేయ‌త మిగ‌తా నాయ‌కుల్లో ఉందో లేదో కానీ మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఇంకా ప్ర‌తిపాద‌న‌లు వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా మంత్రి పేర్ని నాని మ‌రో జిల్లా ఏర్పాటుకు తాము సుముఖంగానే ఉన్నామ‌ని అంటున్నారు. పోల‌వ‌రం ముంపు గ్రామాల‌ను మ‌రియు రంప‌చోడ‌వ‌రంను క‌లిపి ఓ జిల్లాగా ఏర్పాటు చేయాల‌న్న‌ది త‌మ ప్ర‌భుత్వం అభిమ‌తం అని నిన్నటి వేళ స్ప‌ష్టం చేశారు.

ఆ విధంగా చూసుకుంటే మరో జిల్లా ప్ర‌తిపాదిత జిల్లాల జాబితాలో క‌ల‌వ‌నుంది. అంతేకాదు ఇంకొన్ని కూడా తెర‌పైకి వ‌స్తున్నాయి. మ‌ద‌న‌ప‌ల్లెను ప్ర‌త్యేక జిల్లాగా ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నారు. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాకు చెందిన ఈ ప్రాంత వాసులు ఎప్ప‌టి నుంచో త‌మ డిమాండ్ ను వినిపిస్తున్నారు. కానీ ఇది ఆచ‌ర‌ణ సాధ్యం కాలేదు.దీంతో అధికార పార్టీ నాయ‌కులు కూడా త‌మ రాజ‌కీయ భ‌విత‌వ్యం ఏమౌతుందో అన్న ఆందోళ‌న‌లో ఉన్నారు. ఎంతో చ‌రిత్ర ఉన్న మ‌ద‌న‌పల్లెను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయక‌పోవ‌డం శోచ‌నీయం అని, తాము అధికారంలోకి వ‌స్తే జిల్లాను సాధించుకుంటామ‌ని సంబంధిత టీడీపీ నేత‌లు అంటున్నారు. దీనిపై చంద్ర‌బాబు ఏమీ మాట్లాడ‌డం లేదు. అదేవిధంగా ప్ర‌కాశం జిల్లాలోనే అద్దంకిని ఉంచాల‌ని,కానీ అందుకు విరుద్ధంగా బాప‌ట్ల‌లో క‌లిపారని ఆ ప్రాంత వాసులు గ‌గ్గోలు పెడుతున్నారు. దీనిపై కూడా స్ప‌ష్ట‌త లేకుండా అధికారులు వ్య‌వ‌హ‌రించార‌ని ఆవేద‌న చెందుతున్నారు.