ఏబీవీని వెంటాడుతున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. తాజా షోకాజ్ నోటీసు

టీడీపీ హ‌యాంలో ప‌నిచేసిన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారు విడిచిపెట్ట‌డం లేదు. ఇప్పటికే రెండేళ్లుగా స‌స్పెన్ష‌న్‌లో ఉంచిన‌.. ప్ర‌భుత్వం.. అనేక రూపాల్లో త‌న‌ను వేధించింద‌ని.. ఆయ‌న చెప్పుకొచ్చిన విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా మ‌రోసారి ఆయ‌న‌కు ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది. ఏబీవీకి  రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది. గతనెల 21న ఏబీవీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

ముందస్తు అనుమతి లేకుండా సమావేశం ఏర్పాటు చేయడం తప్పేనంటూ ఆయనకు మెమో జారీ చేసింది. ఏబీవీ ఆలిండియా సర్వీస్ రూల్స్‌లోని 6వ నిబంధన పాటించలేదని నోటీసులో పేర్కొంది. మెమో అందిన వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని తెలిపింది. లేనిపక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఆయన్ను హెచ్చరించింది. ఏబీవీ మీడియాతో మాట్లాడడంపై వివరణ కోరుతూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ‌.. షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. మార్చి 31న ఏబీవీ మీడియా సమావేశంలో పెగాసస్‌తోపాటుగా తన సస్పెన్షన్ అంశాలపై మాట్లాడారు.

ఇదిలావుంటే, ప‌పెగాస‌స్ వ్య‌వ‌హారంపై త‌న‌పై అస‌త్య ప్ర‌చారం చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు.. చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, గుడివాడ అమ‌ర్ నాథ్‌ల‌పై ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని… దీనికి అనుమ‌తించాల‌ని.. ఏబీవీ ప్ర‌బుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అయితే.. దీనిపై ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స‌మాధానం రాలేదు. కానీ, తిరుగు ట‌పాలో మీపై చ‌ర్య‌లు తీసుకుంటాం.. అంటూ.. షోకాజ్ నోటీసు రావ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. పెగాస‌స్ విష‌యంలో త‌న పాత్ర లేద‌ని.. త‌న కుమారుడి పాత్ర కూడా లేద‌ని ఏబీవీ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

అంతేకాదు… గ‌త ప్ర‌భుత్వం కూడా ఎలాంటి వినియోగం చేయ‌లేద‌ని ఏబీవీ గ‌త మీడియా స‌మావేశం లో వెల్ల‌డించారు. త‌న పైనా త‌న కుటుంబంపైనా అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని..ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంలో న్యాయ‌పోరాటం చేస్తాన‌న్నారు. అదేస‌మ‌యంలో త‌న స‌స్పెన్ష‌న్ విష‌యంలోనూ.. ప్ర‌భుత్వం త‌ప్పుడు మార్గం అనుస‌రిస్తోంద‌ని.. కేంద్ర హోం శాఖ అనుమ‌తి లేకుండానే త‌నను రెండేళ్ల‌పాటు స‌స్పెండ్లో ఉంచింద‌ని.. ఇక‌, ఈ గ‌డువు కూడా తీరిపోయింద‌ని ఆయ‌న వెల్ల‌డించిన విష‌యం గ‌మ‌నార్హం.