క‌శ్మీర్ ఫైల్స్‌.. దిక్కుమాలిన వ్యవహారం: కేసీఆర్

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సైతం మెచ్చుకుని దేశం ప్ర‌జ‌లు త‌ప్ప‌కుండా చూడాలంటూ.. కామెంట్ చేసిన క‌శ్మీర్  ఫైల్స్ సినిమాపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్.. తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అంతేకాదు.. ఈ సినిమాను చూడొద్ద‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు సమాజానికి మంచిది కావని హితవు పలికారు. బీజేపీ కశ్మీర్‌ ఫైల్స్‌ నినాదాన్ని లేవనెత్తి ఓట్ల రూపంలో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సమాజానికి అవాంఛనీయ, అనారోగ్యమైన ఈ సినిమాను.. ఏ రకంగానూ ఆహ్వానించకూడదని వ్యాఖ్యానించారు.

‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా ద్వారా సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల ద్వారా విష ప్రచారానికి తెరతీసి.. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే సినిమాలు తీయాలి కానీ ఇలాంటి విభజన రాజకీయాలు తగదని హితవు పలికారు. ఈ మేర‌కు టీఆర్ ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. ఈ వ్యాఖ్యలు చేశారు.

“పురోగమిస్తున్న దేశంలో.. ఇరిగేషన్ ఫైల్స్, ఎకనామిక్ ఫైల్స్, ఇండస్ట్రియల్ ఫైల్స్ లాంటి సినిమాల ద్వారా ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంది. కానీ ఈ కశ్మీర్ ఫైల్స్ ఏంటో.. ఈ దిక్కుమాలిన వ్యవహారం నాకర్థం కావట్లేదు. దీనివల్ల ఎవరికి లాభం.? దేశ విభజన చేసి.. ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని తెలంగాణ ప్రజానీకం సహించదు. ఎవ‌రూ కూడా ఈ సినిమాను చూడ‌రు“ అని కేసీఆర్ అన్నారు.  

బీజేపీ కశ్మీర్‌ ఫైల్స్‌ నినాదాన్ని లేవనెత్తి ఓట్ల రూపంలో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని… కేసీఆర్‌ ఆరోపించారు. ఢిల్లీలో కశ్మీర్‌ పండిట్‌లు.. న్యాయం చేయకుండా, మాటలు చెబుతూ దేశ, ప్రజల విభజన చేసి విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె అన్నాం గానీ.. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సిక్కుల సమ్మె అనలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులిచ్చి మరీ కశ్మీర్ ఫైల్స్ చూడమంటున్నారని ఎద్దేవా చేశారు. దుష్ప్రచారాలు, విభజన రాజకీయాలతో జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ సినిమాను నిషేధించ‌డం మానేసి.. ప్రమోట్ చేస్తారా? అని ప్ర‌శ్నించారు.