కేసీఆర్‌కు దీదీ పిలుపు.. మ‌రి జ‌గ‌న్‌కు?

ప్ర‌స్తుత జాతీయ రాజ‌కీయాలు ఆస‌క్తిక‌ర మలుపుల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. వ‌రుస‌గా రెండు సార్లు గెలిచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాల‌న‌పై బీజేపీయేత‌ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నాయి. త‌మ రాష్ట్రాల‌కు ప్ర‌ధాని మోడీ తీవ్ర అన్యాయం చేస్తున్నార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే బీజేపీకి వ్య‌తిరేక పార్టీలన్నీ క‌లిసి ఒక కూట‌మి ఏర్పాటు చేసే దిశ‌గా క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇటీవ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్‌.. దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తూ అక్క‌డి ముఖ్య‌మంత్రులు, కీల‌క నేత‌ల‌తో స‌మావేశామ‌వుతున్నారు. మ‌రోవైపు దేశంలో బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌ని భావిస్తున్న ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కూడా ఆ దిశ‌గా వేగంగా అడుగులు వేస్తున్నారు.

ఏకం చేయాల‌ని..
ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్‌దైనా.. అటు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీదైనా ఒకటే ల‌క్ష్యం. దేశంలో బీజేపీకి వ్య‌తిరేకంగా బీజేపీయేత‌ర‌, కాంగ్రేసేత‌ర పార్టీల‌ను ఏకం చేయ‌డం. మూడో కూట‌మి ఏర్పాటు చేసి బీజేపీని గ‌ద్దె దించ‌డం. ఆ ప‌ని కాంగ్రెస్ సార‌థ్యంలోని కూట‌మికి సాధ్యం కాద‌ని బ‌హిరంగంగానే చెప్పిన మ‌మ‌తా.. మోడీకి తానే ప్ర‌త్యామ్నాయ‌మ‌నే భావ‌న‌లో ఉన్నారు. అందుకే తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి దీదీ ఇప్పుడు బీజీపీయేత‌ర పార్టీల‌ను కూడ‌గ‌ట్టే ప‌ని వేగ‌వంతం చేశార‌ని తెలిసింది. జాతీయ కూట‌మి ఏర్పాటు చేయాల‌నే ల‌క్ష్యంతోనే ఆమె సాగుతున్నార‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. దీని కోసం 2024 లోక్‌స‌భ ఎన్నిక‌లకు ముందుగానే బీజేపీ వ్య‌తిరేక శ‌క్తుల‌ను ఏకం చేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో మ‌మ‌త ఉన్నారు.

వాళ్ల‌కు ఆహ్వానాలు..
ఇప్ప‌టికే బీజేపీపై పోరాటంలో భాగంగా దీదీతో ఫోన్లో మాట్లాడాన‌ని కేసీఆర్ చెప్పిన సంగ‌తి తెలిసింది. ఇప్పుడు కూట‌మి గురించి మాట్లాడేందుకు మ‌మ‌తా బెన‌ర్జీ వివిధ పార్టీల నేత‌ల‌కు, రాష్ట్రాల సీఎంల‌కు ఆహ్వానాలు పంపిన‌ట్లు తెలిసింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌కు ఆమె ఆహ్వానాలు పంపించార‌ని స‌మాచారం. బీజేపీపై పోరుకు క‌లిసి వ‌చ్చేలా క‌నిపిస్తున్న మిగ‌తా సీఎంల‌కు కూడా త్వ‌ర‌లోనే పిలుపు వెళ్ల‌నుంది.

అయితే ఏపీ సీఎం జ‌గ‌న్‌, ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్‌ల‌కు ఆహ్వానించాలా? వ‌ద్దా? అనే విష‌యంపై మాత్రం ఇంకా స్ప‌ష్టం రాలేద‌ని టాక్‌. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుకు ఈ రెండు పార్టీలు మ‌ద్ద‌తుగా నిలుస్తుండ‌డ‌మే అందుకు కార‌ణం. ఏపీకి మోడీ అన్యాయం చేస్తున్న జ‌గ‌న్ ఒక్క మాట కూడా మాట్లాడ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు బీజేపీ వ్య‌తిరేక పార్టీలు ఏక‌మ‌వుతున్న నేప‌థ్యంలో మోడీకి జ‌గ‌న్‌తో అవ‌స‌రం ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అందుకే మ‌మ‌త కూడా జ‌గ‌న్‌కు ఆహ్వానం పంపే విష‌యంలో సందేహిస్తున్నారని తెలిసింది.